న్యూఢిల్లీ: తాలిబన్ల బెదిరింపుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన పాప్ స్టార్ అర్యానా సయీద్ ( Aryana Sayeed )దేశం విడిచి వెళ్లారు. ఖతార్లోని దోహాకు చేరుకున్నానని, అక్కడ నుంచి ఇస్తాంబుల్కు వెళ్లనున్నట్లు ఆమె చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న భయానక పరిణామాలపై అర్యానా సయీద్ కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ఆఫ్ఘన్ దుస్థితికి పాకిస్థాన్ కారణమని ఆమె ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని, దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు చాలా ఉన్నట్లు అర్యానా తెలిపారు. ఎవరైనా ఒక తాలిబ్ను పట్టుకుంటే, అతని ఐడెంటిటీ పాకిస్థాన్కు చెంది ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఆఫ్ఘన్ను విడిచి వచ్చినందుకు సంతోషంగా ఉందని, కానీ అక్కడ ఉన్న మహిళల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పాప్ స్టార్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఎదురైన అనుభవాలు బాధాకరమని, అలాంటి పరిస్థితులే మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయన్నారు. మహిళలు ఇండ్లకే పరిమితం అవుతారని, వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారన్నారు. స్కూల్కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్ల చేతుల్లోకి వదిలేస్తే, అప్పుడు ఆఫ్ఘన్ మహిళలకు భవిష్యత్తు ఉండదన్నారు.
కేవలం కొన్ని రోజుల్లోనే యావత్ ఆఫ్ఘన్ను తాలిబన్లు వశం చేసుకోవడం ఆశ్చర్యపరిచిందని పాప్స్టార్ ఆర్యానా తెలిపారు. ఆల్ఖయిదా, తాలిబన్లను అంతం చేస్తామని అగ్రదేశాలు 20 ఏళ్ల క్రితం ఆఫ్గన్ వచ్చాయని, కానీ ఇప్పుడు తమ దేశాన్ని వదిలి వెళ్లడం బాధ కలిగిస్తోందన్నారు. అంతర్జాతీయ దేశాలు ఆఫ్ఘన్లో శాంత స్థాపన కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. ఆఫ్ఘన్ రాజకీయాల్లో పాక్ జోక్యం చేసుకోకూడదని ఆమె అన్నారు. భారత్ ఎప్పుడూ మాతో సఖ్యంగా ఉందని, వాళ్లు నిజమైన స్నేహితులన్నారు. శరణార్థుల పట్ల ఇండియా దయతో ఉందన్నారు.