మియాపూర్, జూలై 6 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషమైన పథకాలను అమలు చేస్తున్నదని, ఈ పథకాలకు ప్రజలతో పాటు ఆయా పార్టీల నేతలు ఆకర్షితులై గులాబీ పార్టీలోకి వలసలు వసున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలో అన్ని పార్టీల కార్యాలయాలు ఖాళీ కావటం ఖాయమన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత విఠల్ ప్రభుత్వ విప్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు వివేకానందనగర్లోని తన నివాసంలో ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజల ఆదరాభిమానాలతో టీఆర్ఎస్ దూసుకుపోతున్నదని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నదన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని, పార్టీ అభివృద్ధి కోసం పని చేసే వారికి భవిష్యత్లో మంచి పదవులు తప్పక లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, గణేశ్, చంద్రారెడ్డి, రాములు, ఎర్రన్న, నర్సింహులు, శంకర్, ఖాసీం, మల్లేశ్, పరమేశ్, కోటేశ్, అరుణ్, శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.