ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
కోరుట్ల మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ సమావేశం
మెట్పల్లి, మార్చి 31: పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం చైర్పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన మున్సిపల్ 2021-2022 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గుగులోత్ రవి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం ఎజెండాలో రూపొందించిన వార్షిక సాధారణ ఆదాయ అంచనా, వ్యయ బడ్జెట్కు సంబంధించిన వివరాలు అధికారులు చదివి వినిపించారు. 01-04-2021 నాటి అంచనా ప్రారంభ విలువ రూ. 25.65 లక్షలుగా, 2021-22 సంవత్సరంలో సాధారణ ఆదాయం రూ.11 కోట్ల 66 లక్షల 28వేలు కలిపి మొత్తం సాధారణ ఆదాయం రూ.11 కోట్ల 91 లక్షల 93 వేలుగా, 2021 – 22 సంవత్సరంలో క్యాపిటల్ ఆదాయం రూ.25 కోట్ల 44 లక్షలుగా మొత్తం రూ.37కోట్ల 35 లక్షల 93 వేలు ఉందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ సభలో బడ్జెట్ వివరాలను ప్రవేశపెట్టారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకతీతంగా అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి ఉద్ఘాటించారు. కాగా మద్దెల చెరువు మినీ ట్యాంక్ బండ్కు సీతారామాంజనేయ కట్టగా నామకరణం చేయాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అలాగే ట్యాంక్బండ్పై అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహన్ని ప్రతిష్ఠించాలని విన్నవించారు. సమావేశంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, అధికారులు స్వర్ణలత, శ్రీనివాసరావు, ఏఈ సాయిప్రణీత్, శ్రీధర్, మహిపాల్, సతీశ్ పాల్గొన్నారు.