ఒక్క ఆక్సిజన్ యూనిట్ కూడా వృథా కానివ్వొద్దు
కొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కొవిడ్ కేర్ సెంటర్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి
సాధ్యమైనంత మేర ఆక్సిజన్ బెడ్లను పెంచాలి
టెలీకాన్ఫరెన్స్లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
ములుగు, ఏప్రిల్ 28: రోజురోజుకూ కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రం ములుగులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జిల్లా వైద్యాధికారులు, ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వెంటిలేషన్ ఆధారిత చికిత్స పొందుతున్న బాధితులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ నిల్వలు పెంచడం, పడకల సంఖ్య పెంచడం, కొవిడ్కేర్ సెంటర్ వినియోగంలోకి తీసుకురావడం తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గల కొవిడ్ బాధితులకు సిద్దిపేట ప్రభుత్వ జిల్లా జనరల్ దవాఖాన సమీపంలోని నైట్ షెల్టర్లో 70 బెడ్ల సామర్థ్యంగల కొవిడ్ కేర్ సెంటర్ను అన్ని మౌలిక సదుపాయాలు, భోజన వసతి, మందులు, వైద్య సిబ్బందిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం డిమాండ్ను బట్టి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ భవనంలోని కొవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సీసీసీని ప్రభావవంతంగా నడిచేలా చూసేందుకు అధికారులు, సిబ్బందికి జాబ్ చార్ట్ను సూచిస్తూ తన పేరుతో ఉత్తర్వులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్కు సూచించారు. తరుచూ సీసీసీని ఆకస్మిక తనిఖీ చేస్తూ మెరుగైన సేవలు బాధితులకు అందేలా చూడాలన్నారు. సాధ్యమైనంత మేర ఆక్సిజన్ బెడ్లను జిల్లాలో పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆక్సిజన్ ప్లాంట్ రోజు వారీగా 13వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నందున పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్ నడిచేలా చూడాలన్నారు. రోజూ వారి అవసరాలకుపోను 7వేల ఆక్సిజన్ బఫర్ స్టాక్ నిల్వలు అందుబాటులో ఉండేలా చేసుకోవాలన్నారు. కరోనా విజృంభిస్తున్నర నేపథ్యంలో భవిష్యత్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్లాన్-ఏ, ప్లాన్-బి ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్లాన్-ఏలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా అన్ని ప్రైవేట్ దవాఖానల్లో వివరాలను సేకరించి కార్యచరణను 5రోజుల్లోగా సిద్ధం చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరసు, వైద్యాధికారులు కాశీనాథ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.