హైదరాబాద్, మే 29: రాష్ర్టానికి చెందిన ఔషధాల తయారీ సంస్థ దివీస్ ల్యాబ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.392 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ.1,453 కోట్ల నుంచి రూ.1,741 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. బల్క్ డ్రగ్, ఇతర ఔషధాలకు ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి మరో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఆర్ అండ్ డీ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అలాగే గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.20 తుది డివిడెండ్ను సంస్థ ప్రకటించింది.