కాబూల్: అమెరికా మద్దతుతో ఆఫ్ఘన్ ఎయిర్ఫోర్స్ సోమవారం తాలిబన్ల స్థావరాలపై విరుచుకుపడింది. అమెరికన్ ఎయిర్ఫోర్స్ సమకూర్చిన బీ-52 బాంబర్లతో ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా తాలిబన్ ఫైటర్లు మృత్యువాత పడినట్లు అంచనా వేస్తున్నారు. కాందహార్, హెల్మాండ్ ప్రావిన్స్లలో ఈ దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్థాన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఏఏఎఫ్ దాడుల్లో 47 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. దాండ్, ఝెరియా, తక్తపోల్ జిల్లాలతోపాటు కాందహార్ ప్రావిన్స్లోనూ సోమవారం రాత్రి ఈ దాడులు జరిగాయి.
తాలిబన్లకు చెందిన 2 స్థావరాలు, ఒక వాహనం, 2 భారీ ఆయుధాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి అని ఆఫ్ఘన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. అటు హెల్మాండ్లో జరిగిన మరో దాడిలో 45 మంది తాలిబన్లు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు సీనియర్ కమాండర్లు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో వాళ్ల ఆయుధాలను ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో క్రమంగా అక్కడి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో వాళ్లపై ఆఫ్ఘన్ సైన్యం ఎదురుదాడికి దిగుతోంది.