స్టాక్హోమ్: కరోనా సోకిన 8 నెలల తర్వాత కూడా పది మందిలో ఒకరికి దీర్ఘకాల లక్షణాలున్నాయి. వాసన, రుచిని కోల్పోవడం, అలసట వంటివి వెంటాడుతున్నాయి. ఇది వారి విధులతోపాటు వ్యక్తిగత, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. స్వీడన్లోని డాండెరిడ్ హాస్పిటల్, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గత ఏడాదిగా జరిపిన తమ అధ్యయాన్ని జామా జర్నల్లో ప్రచురించారు. సామాజిక అధ్యయనంలో భాగంగా కరోనా సోకిన తర్వాత వ్యక్తులలో రోగనిరోధక శక్తిని పరిశీలించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.
తొలి దశ స్టడీలో భాగంగా డాండెరిడ్ హాస్పిటల్లో 2,149 సిబ్బంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. 19 శాతం మందిలో కరోనా ప్రతికారకాలున్నట్లు గుర్తించారు. ఇలా నాలుగు నెలలకు ఒకసారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. దీర్ఘకాల కరోనా లక్షణాలు, జీవితంపై చూపిన ప్రభావంపై వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
ఈ ఏడాది జనవరిలో మూడో దశ స్టడీ చేపట్టారు. 8 నెలల కిందట తేలికపాటి కరోనా లక్షణాలు కలిగిన వారిపై ఈ బృందం పరిశోధనలు జరిపింది.
43 ఏండ్ల సగటు వయసున్న 323 మంది ఆరోగ్య కార్యకర్తలను ఎంచుకున్నారు. వారిలో 83 శాతం మంది మహిళలు. దీర్ఘకాల కరోనా లక్షణాలు, వారి విధులతోపాటు సామాజిక, వ్యక్తిగత జీవితంపై పడిన ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక విధి నిర్వహణలో కరోనా బారిన పడని 47 ఏండ్ల సగటు వయసున్న, 86 శాతం మహిళలున్న 1,072 మంది ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్య, వ్యక్తిగత, సామాజిక జీవిత వివరాలను దీనితో పోల్చి చూశారు.
నియంత్రణ గ్రూపులో తొమ్మిది శాతంతో పోల్చితే, గతంలో కరోనా ఉన్నవారిలో 26 శాతం మందికి కనీసం తేలికపాటి నుంచి తీవ్రమైన కరోనా లక్షణం ఇంకా ఉన్నట్లు గుర్తించారు. ఈ కరోనా లక్షణం రెండు నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగినట్లు కనుగొన్నారు.
అలాగే నియంత్రణ గ్రూపులోని 2 శాతంతో పోల్చితే సుమారు 11 శాతం మందిలో విధి నిర్వాహణ, సామాజిక లేదా గృహ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిన ఒక కరోనా లక్షణం కనీసం ఎనిమిది నెలలుగా కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాసన, రుచిని కోల్పోవడం, అలసట, శ్వాసకోశ సమస్యలు చాలా సాధారణమైన దీర్ఘకాలిక కరోనా లక్షణాలని పేర్కొన్నారు.
యుక్త, మధ్య వయస్కుల ఆరోగ్యం, వ్యక్తిగత, సామాజిక జీవితంపై కరోనా లక్షణాలు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే అవకాశమున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాను తేలికగా తీసుకోవద్దని వారు సూచించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తరుణంలో తదుపరి అధ్యయాన్ని మే నెలలో మరింత ఎక్కువ మందిపై కొనసాగిస్తామని వెల్లడించారు.