న్యూఢిల్లీ, జూన్ 12: సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ ఎట్టకేలకు నూతన ఐటీ నిబంధనలకు అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాయి. ఈ మూడు సంస్థలతో పాటు కూ, షేర్చాట్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ సైతం చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ (సీసీవో), నోడల్ కాంటాక్ట్ పర్సన్ (ఎన్సీపీ), గ్రీవెన్స్ ఆఫీసర్ (జీవో) పేర్లను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. అయితే ట్విట్టర్ ఇంకా ఐటీ నిబంధనలను పాటించలేదని అధికారులు వెల్లడించారు. నూతన ఐటీ నిబంధనలను మే 26 నుంచి తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించింది. అయితే ఆ సంస్థలు నిబంధనలను పాటించకపోవడం వివాదానికి దారితీసింది. వాట్సాప్ ఇదివరకే దీనిపై కోర్టును ఆశ్రయించింది. నూతన నిబంధనల కారణంగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రయోజనాలు యూజర్లకు లేకుండాపోతాయని, వారి గోప్యతకు ప్రమాదం వాటిల్లుతుందని వాట్సాప్ పేర్కొన్నది. ఈ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. కాగా, పలు సామాజిక మాధ్యమ సంస్థలు నూతన నిబంధనలను పాటించేందుకు అంగీకరించాయని, అయితే ఆరు నెలలు గడువు కోరాయని ఇంతకుముందు వార్తలు వినిపించాయి. అయితే ట్విట్టర్ మాత్రం నిబంధనలకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత గురువారం ట్విట్టర్కు కేంద్రం చివరి హెచ్చరిక చేస్తూ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు దిగొచ్చిన ట్విట్టర్.. నిబంధనలు పాటిస్తామని తెలిపింది. అయితే మరింత సమయం కావాలని కోరింది.