గద్వాల న్యూటౌన్, జూన్ 23 : అనుమతుల్లేవ్.. అడిగేటోళ్లు లేరు.. ఇంకేముంది గుట్టలను తవ్వేస్తున్నారు. రూ.లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని చెనుగోనిపల్లి, నదీఅగ్రహారం, లత్తీపురం, జమ్ములమ్మ రిజ్వాయర్ కింది భాగాన, అనంతపురం, బీరెల్లి, కొండపల్లి, తెలుగొనిపల్లి, గోనుపాడు తదితర గ్రామాల శివారులోని ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల పట్టణ శివారులోని పిల్లిగుండ్ల ఏరియాలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ప్లాట్లలో సైతం అక్రమార్కులు మట్టిని తవ్వి ప్రకృతి సంపదను కొల్లగోడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మట్టి గుట్టలు ఉండడంతో కొందరు చోటా, బడా నాయకులు, అనుచరులు ఈ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న నియంత్రించే నాథుడే కరువయ్యారు.
యథేచ్ఛగా తరలింపు
మట్టిని కాపాడాల్సిన మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. జేసీబీ యంత్రాలు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ భవనాలు, రియల్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్, గోదాం నిర్మాణాలకు తరలిస్తూ.. టిప్పర్కు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్కు రూ.వెయ్యి నుంచి రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో గుట్టలు మాయమవుతున్నాయి.
అనుమతి లేకుండా తవ్వకాలు
మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా దందా సాగిస్తున్నారు. గద్వాల మండలంలోని గద్వాల, చెనుగోనిపల్లి, కొండపల్లి, లత్తీపురం, జమ్మిచేడు, అనంతపురం, బీరెల్లి, కుర్వపల్లి, గోనుపాడు తదితర ప్రాంతాల్లో మట్టి గుట్టలను విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. గుట్టల తవ్వకాలకు రెవెన్యూశాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన అనుమతి మేరకు మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాలి. క్యూబిక్ రూ.42 చొప్పున చెల్లించాకే మట్టి తవ్వకాలు జరపాలి. ముందుగా తవ్వకాలకు సంబంధించి ఈ రెండు శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఈ నిబంధనలేవీ ఇక్కడ అమలు కావడం లేదు. అక్రమార్కులు ఇష్టానుసారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు గుట్టలను తవ్వేస్తున్నారు. పెద్దఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేదల ప్లాట్లలో సైతం
గద్వాల పట్టణ సమీపంలోని పిల్లిగుండ్ల ఏరియాలో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అయితే అందులో కొందరు ఇండ్లు కట్టుకొని ఉండగా.. మరికొందరు గుడిసెలు వేసుకొని జీవనం గడుపున్నారు. ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా తలిస్తున్నారు. ఇక్కడే ఓ ప్రైవేట్ వెంచర్లో 2012లో కొందరు ప్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాట్లలో కూడా మట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో ప్లాట్ల యజమానులు లబోదిబోమంటున్నారు. తమ ప్లాట్లలో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలిసొచ్చిన లాక్డౌన్
కరోనా రెండోదశ వాప్తి చెందుతున్నందున ప్రభుత్వం సా యంత్రం 6 నుంచి ఉదయం 6గంటల వరకు లాక్డౌన్ విధించడంతో మట్టి మాఫియాకు కలిసొచ్చింది. లాక్డౌన్ వల్ల బ యట ఎవరూ తిరగకపోవడంతో ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు రాత్రివేళల్లో మట్టిని తరలిస్తున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు నాయకుల అండదండలు ఉండడం తో అధికారులు చర్యలు తీసుకోకపోగా తలలు పట్టుకుంటున్నా రు. ఈ విషయంపై మైనింగ్ శాఖ అధికారి విజయరామ రాజు ను వివరణ కోరగా మట్టి తరలించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అక్రమంగా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.