భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని
బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం బేగంపేట బ్రాహ్మణవాడిలోని రామానంద తీర్థ స్మారకకేంద్రం ఆవరణలో పీవీ నరసింహారావుభవన్లో పునరుధ్ధరించిన పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కల్వకోట సంతోష్బాబు రాసిన ‘భాగ్యవిధాత పీవీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. స్వామి రామానందతీర్థ వంటి చారిత్రక మహనీయుడి ప్రియశిష్యుడిగా పీవీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. తండ్రి ఆశయాలను కొనసాగించే బాధ్యతను సురభి వాణిదేవి సమర్థంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. రామానందతీర్థ స్మారక కేంద్రం అభివృద్ధికి, పీవీ సంకల్పించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తామని హామీఇచ్చారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ.. తన తండ్రి పీవీ ఆలోచనలు, ఆశయాల పునాదిగా ఏర్పడిన స్వామి రామానందతీర్థ స్మారకకేంద్రం ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, కార్పొరేటర్ మహేశ్వరి, కొలను లక్ష్మీ సోలార్ ఎనర్జీ ప్రోగ్రాం డైరక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు.