సీఎం కేసీఆర్ కృషితోనే చెక్డ్యాంల నిర్మాణం
రైతులకు సీఎం కేసీఆర్ కొండంత భరోసా
ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి
మంజీరా మొదటి చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసి జల హారతి ఇచ్చిన ఎమ్మెల్సీ
మెదక్, ఏప్రిల్ 22 :గోదావరి జలాలు మెతుకు సీమను ముద్దాడి మత్తళ్లు దుంకుతుండడంతో రైతులతో పాటు నాయకుల్లో ఆనందం నెలకొంది. మండుటెండల్లో పరవళ్లు తొక్కుతున్న జలాలను చూసి వారంతా పులకించి పోతున్నారు. గంగమ్మకు చీరె, సారె సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. గోదారమ్మకు జలహారతి పడుతున్నారు. గురువారం మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి వద్ద చెక్డ్యామ్లో గోదావరి జలాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పూజలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాపన్నపేట మండలం గాంధారిపల్లి శివారులోని మంజీర నదిలో చెక్డ్యాం వద్ద, ర్యాలమడుగు చెక్డ్యాం వద్ద పూజలు చేశారు. వీరి వెంట రైతులు, నాయకులు ఉన్నారు.
గోదావరి జలాలు మెతకు సీమకు చేరాయని, ఇక జిల్లా సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి వద్ద చెక్డ్యాంలో గురువారం గోదావరి జలాలకు ఆయన జల హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు హల్దీవాగు, మంజీర నదిపై ఒక్క చెక్డ్యాం నిర్మించలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంజీరా నదిపై 15 చెక్డ్యాంలను నిర్మించిందని తెలిపారు. మంజీర నదిపై చెక్డ్యాంలు నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాధించినట్లు తెలిపారు. గోదావరి జలాలు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతూ నిజాంసాగర్కు జలాలు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు రెండు పంటలకు సాగుచేసుకోవచ్చని తెలిపారు. గోదావరి నీరుతెచ్చిన సీఎం కేసీఆర్ను ప్రజలు ఎప్పుడూ మరిచిపోరన్నారు.
మెతకు సీమకు జలకళను తెచ్చి రైతుల్లో భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, పాపన్నపేట మండల మాజీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, యువ న్యాయవాది జీవన్రావు, సర్పంచులు దేవాగౌడ్, మహిపాల్రెడ్డి, యామిరెడ్డి, సుధాకర్, లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ అజయ్, భయన్న, నాయకులు కుర్తివాడ కిష్టాగౌడ్, సిద్ధిరాంరెడ్డి, పాపన్నపేట, హవేళిఘనపూర్ మండలంలోని రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.