ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉన్నది. ఈ విషయాన్ని ఆ దేశాధినేత కిమ్ జాన్ ఉన్ అంగీకరించారు. దేశంలో ఆహార నిల్వలు అడుగంటిపోయినట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కిమ్ మాట్లాడారు. ఆహార కొరత వల్ల ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయినట్లు ఆయన వెల్లడించారు. టైఫూన్ల వల్ల వరదలు రావడంతో ఆహార ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఆహార ధరలు ఆకాశాన్ని అంటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నార్త్కొరియాలో ఒక కిలో అరటిపండ్లు 45 డాలర్లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ వల్ల నార్త్కొరియా తన సరిహద్దుల్ని మూసివేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనాతోనూ వాణిజ్యాన్ని బ్రేక్ చేసింది. దీంతో ఉత్తరకొరియాలో తీవ్ర కరువు ఏర్పడింది. ఫుడ్, ఫెర్టిలైజర్, ఫ్యూయల్ కోసం చైనా మీదనే ఉత్తర కొరియా ఆధారపడుతుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ క్వార్టర్లో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగినట్లు ఆయన చెప్పారు. గతంలోనూ ఓసారి ఉత్తరకొరియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 1990 దశకంలో ఆ కరువు వచ్చింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం వల్ల అప్పట్లో ఉత్తరకొరియాకు కీలక సాయం అందలేదు. ఆ సమయంలో సుమారు 30 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయినట్లు తెలుస్తోంది.