ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ దేశం విడిచి పారిపోలేదని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనీ వ్యాఖ్యానించారు. మెహుల్ ఛోక్సీ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా గాలిస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదు. దాంతో ఆంటిగ్వా ప్రభుత్వం అతని జాడ కనిపెట్టడం కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించింది.
ఈ విషయాన్ని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనీ ఆ దేశ పార్లమెంట్కు కూడా వివరించారు. కానీ, ఛోక్సీ క్యూబాకు పారిపోయి ఉండవచ్చన్న వార్తలను బ్రౌనీ ఖండించారు. ‘ఛోక్సీ ఆంటిగ్వా విడిచి క్యూబా లేదా ఇతర కరేబియన్ దేశానికి పారిపోలేదు. అందుకు కచ్చితమైన ఆధారం లేదు. ప్రస్తుతానికి ఎయిర్పోర్టు నుంచి ఎలాంటి విమాన రాకపోకలు జరుగట్లేదు. ఇక బోటు ద్వారా క్యూబాకు వెళ్లి ఉంటే మాకు కచ్చితంగా తెలుస్తుంది. ఆయన బోటు ఎక్కినట్లు కూడా ఆధారాల్లేవు. ఆయన ఇక్కడే ఉన్నారని భావిస్తున్నాం. ఆచూకీ కోసం అన్ని చర్యలు చేపట్టాం’ అని బ్రౌనీ పార్లమెంట్కు వివరించారు.
అంతేగాక, ఇంటర్పోల్తో కలిసి యెల్లో నోటీస్ కూడా జారీ చేసినట్లు మెహుల్ ఛోక్సీ తెలిపారు. అదృశ్యమైన వ్యక్తుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఇంటర్పోల్ ఈ యెల్లో నోటీస్ జారీ చేస్తుంది. దీని ద్వారా కనిపించకుండా పోయిన వ్యక్తి దేశాల మధ్య ప్రయాణం చేశాడా లేదా అన్నది తెలుస్తుంది. కాగా, గత ఆదివారం ఛోక్సీ డిన్నర్ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. అదే రోజు సాయంత్రం జాలీ హార్బర్ ప్రాంతంలో ఆయన కారును పోలీసులు గుర్తించారు. అందులో ఆయన లేకపోవడంతో గాలింపు చేపట్టారు.
కాగా, పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే ఛోక్సీ భారత్ విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆంటిగ్వాలో పౌరసత్వం తీసుకుని 2018 నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే ఛోక్సీని అప్పగించాలని భారత్ కోరినప్పటికీ అందుకు ఆంటిగ్వా ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది. ఇటీవల ఈ విషయమై భారత్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఛోక్సీ దేశం విడిచి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మార్గం ద్వారా క్యూబా వెళ్లి ఉండొచ్చని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి.