రాష్ట్రంలో 30 వరకు ఓ మోస్తరు వానలు
ఝరాసంఘంలో 49 మి.మీ. వర్షం
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతం నుంచి రుతుపవనాల కదలిక బాగుందని, ఫలితంగా పశ్చిమ, వాయవ్య దిశలనుంచి బలమైన కిందిస్థాయి గాలులు రాష్ట్రంలో వీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 49 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.