ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి కశ్మీర్ సమస్యపై స్పందించారు. ఒకసారి కశ్మీర్ సమస్య పరిష్కారమైతే, అప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. హెచ్బీవో జర్నలిస్టు జోనాథన్ స్వాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సమాధానం వెల్లడించారు. పాకిస్థాన్లో అత్యంత వేగంగా అణ్వాయుధాలను సమీకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయని, ఎందుకు అలా జరుగుతున్నట్లు ఆ జర్నలిస్టు పాక్ ప్రధానిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బదులిస్తూ ఇంటెలిజెన్స్కు ఎక్కడ నుంచి సమాచారం వస్తుందో తనకు తెలియదని, పాకిస్థాన్ అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసం మాత్రమే అన్నారు. అణ్వాయుధాలు పెరుగుతున్నాయన సంఖ్య తనకు తెలియదన్నారు.
అణ్వాయుధాలకు తాను వ్యతిరేకమని, ఇండియాతో మూడు సార్లు యుద్ధం జరిగిందని, అణ్వాయుధ సామర్థ్యం పెరిగిన తర్వాత తమ మధ్య యుద్ధాలు జరగలేదని, కేవలం సరిహద్దు సమస్యలు మాత్రమే ఉన్నాయని ఇమ్రాన్ అన్నారు. ఒకసారి కశ్మీర్లో సెటిల్మెంట్ సమస్య తీరితే, అప్పుడు రెండు పొరుగు దేశాల్లోని ప్రజలు నాగరికుల్లా జీవిస్తారన్నారు. అప్పుడు అణ్వాయుధాలు అవసరం ఉండదని పాక్ ప్రధాని తెలిపారు. చైనాలో ఉయిగర్ ముస్లింపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించగా.. ఆ అంశం గురించి డ్రాగన్ దేశంతో అంతర్గతంగా చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఉయిగర్లను వదిలేయండి.. కశ్మీర్లో లక్షల మంది చనిపోయారని, దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అది ఎందుకు సమస్య కాదు అని ఇమ్రాన్ అడిగారు.