కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తాలిబన్ మరిన్ని ఆంక్షలు విధించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించే వరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఆఫ్ఘన్ జాతీయులు కాబూల్ ఎయిర్పోర్టుకు వెళ్లవద్దని హుకుం జారీ చేసింది. ప్రస్తుతం విదేశీయులు మాత్రమే ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం మీడియాతో అన్నారు. ఆఫ్ఘన్లో జనజీవనం సాధారణ స్థితికి వచ్చినా, ఎయిర్పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ జాతీయులు ఎట్టిపరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కు వెళ్ల వద్దని సూచించారు.
పంజ్షీర్లోని సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు జబిహుల్లా చెప్పారు. ఆగస్ట్ 31 నాటికి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సిందేనని మరోసారి అన్నారు. ఆఫ్ఘన్ నిఫుణులను దేశం నుంచి తరలించడం మానుకోవాలని హితవు పలికారు. ఇంటింటి తనిఖీలు జరుగడం లేదన్నారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడి ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ భేటీ గురించి తనకు తెలియదన్నారు.