మహబూబ్నగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి పాల్గొంటారు. వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసే సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్ ద్వారా మంత్రి బయలుదేరనున్నారు.
గంట సేపట్లో నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు.. ఆ తర్వాత ఉదయం 10:15 గంటలకు తొలి కార్యక్రమం ప్రారంభంకానున్నది. జిల్లా దవాఖానలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థతో సిద్ధం చేసిన చిన్న పిల్లల వార్డును మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం 10:30 గంటలకు పట్టణంలో బస్డిపో ఎదురుగా రూ.6 కోట్లతో చేపడుతున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కు శంకుస్థాపన, 10:45 గంటలకు రూ.20 లక్షలతో నిర్మించనున్న అమరవీరుల స్మారక స్తూపం శంకుస్థాపన, సింగారం చౌరస్తా వద్ద రూ.10 కోట్ల విలువైన 2.3 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టైక్స్ టైల్ పార్కు శంకుస్థాపనలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం 11:15 గంటలకు రూ.4 కోట్లతో అంబేద్కర్ చౌక్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన, 11:30 గంటలకు తర్వాత చిల్డ్రన్ పార్కు, 11:45 గంటలకు సైన్స్ పార్కు ప్రారంభం, మధ్యాహ్నం 12 గంటలకు పట్టణ ప్రగతి సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరుకానున్నారు.