బొడ్రాయిబజార్/సూర్యాపేట రూరల్, జూలై 8 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. గురువారం 13, 24, 33, 37 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందన్నారు. ఇండ్లలోని చెత్తను రోడ్లు, మురికి కాల్వలు, ఖాళీ స్థలాల్లో వేయవద్దని సూచించారు. మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు వట్టె రేణుకాజానయ్యయాదవ్, బైరు శైలేందర్, కొండపల్లి భద్రమ్మాసాగర్రెడ్డి, బత్తుల లక్ష్మీజానియాదవ్, ఎస్కే రఫీ, డీఈ సత్యారావు, జీకేడీ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెత్తను తొలగించి.. మొక్కలు నాటి..
మండలంలో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం మురికి కాల్వల్లో చెత్తాచెదారం తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించి మొక్కలు నాటారు.
పల్లెలన్నీ అభివృద్ధి బాటలో పయనించాలి : ఎంపీడీఓ
చివ్వెంల, జూలై : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాలని ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సూర్యాపేట- ఖమ్మం రహదారి వెంట మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్ రెడ్డి, ఎంపీఓ గోపి, సర్పంచ్ భద్రు పాల్గొన్నారు.