కనుల పండువగా ఉగ్ర నారసింహుడి తెప్పోత్సవం.. డోలోత్సవం
బ్రహ్మ పుష్కరిణిలో విహరించిన స్వామివారు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
గోదావరిలో పుణ్యస్నానాలు
ధర్మపురి, మార్చి 29: నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా తెప్పోత్సవం.. డోలోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ బ్రహ్మ పుష్కరిణి(కోనేరు)లో శ్రీలక్ష్మీ నర్సింహస్వామి (ఉగ్ర)వారి తెప్పోత్సవం, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య సాయంత్రం ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి మంగళవాయిద్యాల నడుమ బ్రహ్మ పుష్కరిణికి తీసుకువచ్చారు. అనంతరం హంసవాహనంలో స్వామి వారు పుష్కరిణిలో విహరించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు అలరించాయి. అనంతరం డోలోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యజ్ఞాచార్యులు పురుషోత్తమాచార్యులు యాగశాల వద్ద యాగాది కార్యక్రమాలు నిర్వహించారు.