హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రక్తదానం ప్రాణదానంతో సమానమని అంటుంటాం. తలసేమియా బాధితులకు, ప్రమాదాల్లో గాయపడ్డవారికి, శస్త్రచికిత్సలు, ప్రసవం సమయంలో రక్తం ప్రాణాలను నిలుపుతుంది. అయితే కరోనా రక్తదానంపైనా ప్రభావం చూపుతున్నది. వైరస్ భయంతో రక్తదాతలు వెనుకంజ వేయడం, నిబంధనల కారణంగా క్యాంపులు నిర్వహించలేకపోవడం, విద్యాసంస్థలు మూసివేతతో యువత ఇండ్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో రక్త సేకరణ సగానికిపైగా పడిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 132 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా 1.20-1.50 లక్షల యూనిట్ల రక్తం అవసరం అవుతుందని అంచనా. గతంలో అవసరానికి మించి ఏటా రెండు లక్షలకుపైగా యూనిట్ల రక్తం సేకరించేవారు. దీంతో సరిపడా నిల్వలు ఉండేవి. అయితే గతేడాది లాక్డౌన్ విధించినప్పటి నుంచి రక్తసేకరణ గణనీయంగా పడిపోయింది. ఏడాది కాలంలో సుమారు 90-95 వేల యూనిట్లు మాత్రమే సేకరించినట్టు వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో లోటును భర్తీ చేసుకునేందుకు రెడ్క్రాస్ సొసైటీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రక్తం సరిపడా దొరుకక తలసేమియా అండ్ సికిల్ సెల్ అనీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘రక్త’ విపత్తును అడ్డుకుందాం
టీకా వేసుకున్నవారు, కరోనా నుంచి కోలుకున్నవారు కనీసం రెండు నెలలు రక్తదానం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే 45 ఏండ్లకుపైబడినవారికి టీకాలు వేశారు. దీంతో వారు రక్తదానానికి దూరంగా ఉన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లకు పైబడినవారు టీకాలు వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రక్తదానం చేయగలిగేవారంతా వ్యాక్సినేషన్ క్యాటగిరీలోకి వెళ్తుండటంతో రాబోయే మూడునాలుగు నెలలు రక్తం కొరత తీవ్రమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తలసేమియా బాధితులకు ఒది ఒక విపత్తుగా పరిణమిస్తుందని చెప్తున్నారు. కాబట్టి టీకా వేసుకోకముందే రక్తదానం చేయాలని కోరుతున్నారు. దీంతోపాటు కరోనా నుంచి కోలుకొని రెండు నెలలు గడిచినవారు కూడా రక్తదానం చేసి ప్రాణాలు నిలుపాలని కోరుతున్నారు.
పిల్లల పరిస్థితి తలుచుకుంటే..
తెలుగు రాష్ర్టాల్లో కలిపి మా సొసైటీలో 2,950 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. రోజూ కనీసం 40 మందికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. నెలకు 2వేల యూనిట్లు అవసరమవుతాయి. గతంలో రోజూ 40-50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసేవారు. ఇప్పుడు సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉన్నట్టు రాబోయే రోజుల్లో రక్తం కొరత కనిపిస్తుంది. మా పిల్లల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తున్నది. యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. దాతలు 040-29880731/ 29885658, 8885534913 నంబర్లను సంప్రదించగలరు.
యువత ముందుకు రావాలి
గతంలో మేము బ్లడ్ క్యాంప్లు పెట్టినప్పుడు కనీసం 50-100 యూనిట్ల రక్తం సేకరించేవాళ్లం. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేసేవాళ్లు. ఏడాదిగా విద్యాసంస్థలు, హాస్టళ్లు బంద్ కావడంతో రక్తం దొరకడం చాలా కష్టమవుతున్నది. రక్తం ఇవ్వడానికి దవాఖానకు వెళ్తే కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఇలాగే కొనసాగితే రక్త సంక్షోభం ఖాయం. టీకా వేసుకుంటే కనీసం రెండు నెలలు రక్తదానం చేయలేరు. కాబట్టి యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నా.