కాబూల్: అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది. దీని ప్రకారం అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్లో ఇప్పటికిప్పుడు హింసకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన చర్య అని శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఘనీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తాలిబన్లు, ప్రస్తుత ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
అందరితో చర్చించిన తర్వాతే ఈ ఫార్ములాను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకూ అధికారికంగా దీనిని ఇటు తాలిబన్లతోగానీ, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వంతోగానీ పంచుకోలేదు. మెల్లగా దేశంలోని మొత్తం భూభాగం తమ చేతుల్లో నుంచి జారి పోతుండటంతో అధికారం పంచుకుందామంటూ గురువారం ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని తాలిబన్లు తిరస్కరించారు.