వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మొగిలిచర్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్కు మద్దతుగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మొగిలిచర్ల గ్రామానికి ఎమ్మెల్యే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దు అని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కావడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.
సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ రెండేళ్లలో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, 65 ఏళ్ల వయసు 57 ఏళ్లకు కుదించి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నాం అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.