చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతూ సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కింది. కోయంబత్తూర్ బరిలో నిలిచిన నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్ధాపకుడు కమల్ హాసన్కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కోయంబత్తూర్లో తమ పార్టీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్తో చర్చకు రావాలని కమల్ హాసన్ను ఆమె సవాల్ చేశారు. కమల్ తన ప్రచారంలో అభివృద్ధి పనులపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న క్రమంలో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్ధితో ఆయన చర్చకు రావాలని కోరారు.
కోయంబత్తూర్లో నిర్వహించిన గుజరాతీ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ కొన్నేండ్ల కిందట కమల్ హాసన్తో తాను ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేశారు. అంశాలపై పట్టు ఉండి సమస్యల పరిష్కారంలో ఎవరు చురుకుగా వ్యవహరిస్తారో నిరూపించేందుకు వనతి శ్రీనివాసన్తో చర్చకు రావాలని తాను కమల్ హాసన్ను సవాల్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పది కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే తమిళనాడులోనే 90 లక్షల టాయ్లెట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.