జెరూసలేం: ఇజ్రాయెల్లో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో సుదీర్ఘ కాలంగా(2009 నుంచి) ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న నెతన్యాహూ శకం ముగియనున్నది.ఎనిమిది పార్టీలు కూటమిగా ఏర్పడి నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు యెష్ అతీద్ పార్టీ నేత యేర్ ల్యాపిడ్ చెప్పారు. అంతకుముందు ఇజ్రాయెల్ అధ్యక్షుడు రైవ్లిన్కు కూటమి ఏర్పాటుపై సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సిన గడువు బుధవారం అర్ధరాత్రితో ముగియనుండగా, అందుకు అరగంట ముందు ఆయన అధ్యక్షుడిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాచారం ఇచ్చారు.