మహబూబ్నగర్ టౌన్, మే 6 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరీక్షలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో మున్సిపల్, వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఒకటో వార్డు పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు. తెలంగాణ సర్కార్ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికే ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు సమస్యలు ఉంటే చెబితే ఇంటివద్దే మందులు అందజేస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలు వార్డులో రోజూ సర్వే నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఏఈ హరికృష్ణ, హెల్త్ అసిస్టెంట్ వజ్రాకుమార్రెడ్డి, ఆయా వార్డుల అధికారులు, జవాన్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటి సర్వే ప్రారంభం
హన్వాడ, మే 6 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువా రం మండలంలో ప్రజల ఆరోగ్యంపై ఇంటింటి సర్వే ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సేకరించారు. వారికి ఎలాంటి జలుబు ఉన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని పలు సూచనల చేశారు. మండలంలో రోజు రోజుకూ కరో నా కేసులు పెరగడంతో అప్రమత్తంగా ఉండి మాస్కులు విధిగా ధరించాలని సూ చించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ శేఖర్, ఏఎన్ఎం మహేశ్వరి, అంగన్వాడీ టీచర్లు కవిత, రాఘవేంద్రమ్మ, భీమమ్మ, భాగ్యమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అధికారుల ఇంటింటి సర్వే
బాలానగర్, మే 6 : మండలంలోని పెద్దరేవల్లి, అప్పాజిపల్లిలో గురువారం ఎంపీడీవో కృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అధికారులు, సర్పంచులతోపాటు విస్తృతంగా ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు తదితర లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని దవాఖానకు వెళ్లి పరీక్షించుకోవాలని వారు సూచించారు. కొవిడ్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వారు వివరిస్తూ సర్వే చేపట్టారు. సర్వేలో సర్పంచులు నర్మదా లింగారెడ్డి, శారద, కావలి బాల్రాజు, అంగన్వాడీ టీచర్లు సునీత, పారిజాత, కృష్ణవేణి ఆశ వర్కవర్లు భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జ్వర సర్వేను విజయవంతం చేయాలి
భూత్పూర్, మే 6: కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేయాలని ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ తెలిపారు. గురువారం ఈ కార్యక్రమాన్ని 10వ వార్డులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యబృందం ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు తమ ఆరోగ్య పరిస్థితులను తెలియజేయాలని, కరోనా లక్షణాలు ఉన్నైట్లెతే వారికి వెంటనే మందుల కిట్ ఇస్తారని ఆయన తెలిపారు. పరీక్షలు ఆలస్యమైతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల్లో ఈ సర్వేను పూర్తిచేసి నివేదికను అందజేస్తారని ఆయన తెలిపారు. సర్వేను ఆధారంగా మందుల పంపిణీ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ నూరుల్నజీబ్, మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్నారాయణగౌడ్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వార్డు నాయకులు అశోక్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ లక్షణాలుంటేనే టెస్టులకు రావాలి
జడ్చర్ల టౌన్, మే 6 : కొవిడ్ లక్షణాలుంటేనే టెస్టులకు రావాలని జడ్చర్ల అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ సూచించారు. జడ్చర్ల సెంటర్లో ప్రతిరోజు 50 టెస్టులు మాత్రమే టార్గెట్గా చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు లేనివారు, కంపెనీల ఉద్యోగులు నెగిటివ్ రిపోర్టుల కోసం అనవసరంగా టెస్టుల కోసం వస్తున్నారన్నారు. దీంతో లేని వారికి సైతం వైరస్ సోకే ప్రమాదం ఉన్నదన్నారు. పాజిటివ్ వచ్చిన వారు 14 రోజులు ఐసోలేషన్ తర్వాత రీటెస్టింగ్ అవసరం లేదన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడాలన్నారు. మూడు రోజులకూ జ్వరం తగ్గకపోతే టెస్టులకు రావాలని సూచించారు. కరో నాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాల న్నారు. తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇంటింటి సర్వే..మందులు పంపిణీ
కరోనాను అరికట్టడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం జడ్చర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ కెళ్లి కొవిడ్ సర్వే నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు అందజేశారు. అలాగే జడ్చర్ల తాసిల్దార్ లక్ష్మీనారాయణ, డీఎంవో విజయ్కుమార్, అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ మండలంలోని గంగాపురం పీహెచ్సీని సందర్శించారు. కరోనా టెస్టులు, వైద్య చికిత్సల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. కొవిడ్ లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి టెస్టులకు సిపారసు చేశారు. జడ్చర్ల అర్బన్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వేను చేపడుతున్నట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
సర్వే షురూ..
నవాబ్పేట, మే 6 : మండలంలో వివిధ గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే గురువారం ప్రారంభమైంది. జ్వర సర్వేలో భాగంగా మండలంలోని 54 గ్రామ పంచాయతీలకుగానూ 43 టీమ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్లో ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, ఆశ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి రోజు 2,853 ఇండ్లల్లో సర్వే నిర్వహించినట్లు మండల వైద్యాధికారి నవీన్కుమార్రెడ్డి తెలిపారు. మొదటి రోజు 110 మందికి జ్వరం ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. వారందరికీ మందులు సరఫరా చేశామని ఐదు రోజుల్లో వారికి జ్వరం తగ్గకపోతే కరోనా టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో రాములు, ఆర్ఐ జ్ఞానేశ్వర్రెడ్డి, వైద్య సిబ్బంది, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఫీవర్సర్వే చేపట్టాలి
కోయిలకొండ, మే 6 : మండలంలో ప్రతి ఇంట్లో ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో రాఘవ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ఫీవర్ సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు సూచించారు.