ఖాట్మాండు: ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రద్దయిన ప్రతినిధుల సభను పునరుద్ధరించింది నేపాల్ సుప్రీంకోర్టు. అంతేకాదు రెండు రోజుల్లోపు నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలనీ ఆదేశించింది. అక్కడి మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేపీ శర్మ ఓలీకి ఇది కోలుకోలేని దెబ్బ. ఈ కేసులో చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. గత వారం వాదనలు వినడం పూర్తి చేసింది.
ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసు మేరకు మే 22న నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి దిగువ సభను రద్దు చేశారు. ఐదు నెలల వ్యవధిలో దిగువ సభను రద్దు చేయడం ఇది రెండోసారి. నవంబర్ 12, 19వ తేదీల్లో ఎన్నికలను కూడా ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల కోసం గత వారమే ఎన్నికల సంఘం షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అయితే దిగువ సభను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్తోపాటు మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిగువ సభను పునరుద్ధరించడమే కాకుండా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ చీఫ్ను ప్రధానిని చేయాలని ఆదేశించడం గమనార్హం.