కొత్త పెన్షన్లు, ఇండ్లు అర్హులందరికీ ఇస్తాం
గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
కొత్తూరు, ఏప్రిల్ 23 : ‘కొత్తూరును మున్సిపాలిటీగా చేశాం.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తాం..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం కొత్తూరు మున్సిపాలిటీలోని 5, 6, 7వ వార్డుల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి గడపగడపకూ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్నారు. కొత్తూరు ప్రాంతం గత పాలకుల వల్ల వివక్షకు గురైందన్నారు. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్తూరు మున్సిపాలిటీ 5వ వార్డు అభ్యర్థి హైమావతి నర్సింహాగౌడ్, 6వ వార్డు అభ్యర్థి సరస్వతి వెంకటేశ్, 7వ వార్డు అభ్యర్థి జయమ్మ జనార్దనచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తూరు మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దుతామన్నారు.
కరోనా పరిస్థితుల్లోను సంక్షేమ పథకాలు అమలు..
కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. 5, 6, 7 వార్డుల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుతుందన్నారు. నిరంతర విద్యుత్, అభివృద్ధి పథకాల అమలుకు జనం జేజేలు పలుకుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న మున్సిపల్ పోరులో కొత్తూరులోని 12 వార్డుల్లో అన్నింటినీ గెలుస్తామని అంతర్గత సర్వేలో తేలిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అత్యధిక మెజార్టే లక్ష్యంగా టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం నిర్వహించాలని సూచించారు. వేరే పార్టీలు కనీసం పోటీలో కూడా లేవన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జిలతో మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం సాయంత్రం పాపరస్ పోర్టులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభ్యర్థులు, ఇన్చార్జిలు సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలన్నారు. గెలిచిన అనంతరం అర్హులందరికీ పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఓటర్లకు చెప్పాలన్నారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడుగాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు కదలాలని కోరారు.
ప్రచారంలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించొద్దని సూచించారు. ప్రాచారంలో ఏమైనా సమస్యలు ఉంటే తనకు గాని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు గానీ తెలిపితే పరిష్కరిస్తామన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిందని, దాని అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని 12 వార్డులకు గెలిస్తే అధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి రోల్ మోడల్గా తయారు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, 12 వార్డుల అభ్యర్థులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీపీఐ(ఎం)కు చెందిన 16 సంస్థలపై ఏడాది నిషేధం
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి