నెపితా: బౌద్ద గురువు అసిన్ విరాతును మయన్మార్ మిలిటరీ రిలీజ్ చేసింది. జాతీయోద్యమ, ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో విరాతు దిట్ట. గత ప్రభుత్వం విరాతుపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. అయితే ఫిబ్రవరిలో సైనిక పాలన వచ్చిన తర్వాత విరాతుపై కేసులను ఎత్తివేశారు. మిలిటరీకి అనుకూలంగా అభిప్రాయాలను విరాతు వ్యక్తపరిచారు. బౌద్ద బిన్ లాడెన్ అంటూ ఆయన్ను పిలుస్తారు. ముస్లింలను టార్గెట్ చేస్తూ అతను చేసే ప్రసంగాలు చాలా పదునుగా ఉంటాయి. ముఖ్యంగా రోహింగాలను తన ప్రసంగాలతో టార్గెట్ చేసేవారు. ఇటీవల జుంటా మిలిటరీ తరపున ప్రచారం చేశారు. ఆంగ్ సాన్ సూకీ, నేషనల్ లీగ్ పార్టీలను తన ప్రసంగాల్లో విమర్శించేవారు.
అయితే 2019లో విద్వేష ప్రసంగం చేస్తున్నట్లు అతనిపై కేసు బుక్ చేశారు. ఆ సమయంలో విరాతు పరారీ అయ్యారు. గత ఏడాది నవంబర్లో మళ్లీ అధికారులకు లొంగిపోయాడు. విరాతుపై ఉన్న అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు మిలిటరీ ప్రభుత్వం సోమవారం పేర్కొన్నది. ప్రస్తుతం అతను ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మయన్మార్లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా హింస చేపట్టిన కేసుల్లో విరాతు కీలక నిందితుడు. బౌద్ద జాతీయోద్యమం సాగించాడు. బౌద్దులకు చెందిన షాపులను, ఆస్తులను కేవలం వారికే అమ్మాలని, బౌద్దులు ఆ మతస్తులనే చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2012లో రాఖైన్ ప్రావిన్సులో జరిగిన హింసతో విరాతు వెలుగులోకి వచ్చారు.