ఇండ్లు, పెండ్లితో సాయం
పైసా లంచం లేకుండా పథకాల అమలు
ఎర్రటి ఎండలోనూ ఎగువమానేరును నింపుతున్నాం
మరికొద్దిరోజుల్లోనే జలదృశ్యం ఆవిష్కృతమవుతుంది
రాష్ట్రంలోనే సిరిసిల్లను ఆదర్శంగా నిలుపాలి
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3 : ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. చాలా కష్టమని తెలిసే అలా అన్నారు. అలాంటి కష్టాన్ని పేదలు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నారు. కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్ద దిక్కుగా సాయం చేస్తు న్నారు. ఇలాంటి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారు’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. శనివారం ముస్తాబాద్ మండలం మోహినికుంటలో డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు పొందిన లబ్ధిదారుల్లో సంతోషం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలను మంత్రి కేటీఆర్ తిప్పికొడుతూ.. ‘రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే’ అని ఆంగ్ల సామెతను ఉదహరిస్తూ జిల్లాలో ప్రణాళికా ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
దాదాపు 400 కోట్లతో 6,886 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 3100 ఇండ్లు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో డబ్బాలాంటి ఇండ్లను ఇచ్చారని, వాటికి మూడు రంగులు పూసి నిబంధనల పేరిట ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం తెలంగాణలో నయా పైసా లంచం లేకుండా పేదలకు ఇండ్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇండ్లల్లో రెండు బెడ్రూంలు, కిచెన్, హాల్, బాత్రూంలు, ఇలా అన్ని వసతులు కల్పిస్తున్నామని, కుటుంబసభ్యులంతా కలిసి ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 75 వేలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణానికి 5.04లక్షలు వెచ్చిస్తున్నదని, దాదాపు ఏడు రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నదని చెప్పారు. పల్లె ప్రగతిలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, డంప్ యార్డ్, వైకుంఠధామం, నర్సరీలు, ఇంటింటికీ మరుగుదొడ్లు.. ఇలా ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని వసతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఎర్రటి ఎండలో ఎగువమానేరులోకి జలాలు
మల్లన్నసాగర్ నుంచి తరలివచ్చిన గంగమ్మతో ఎగువమానేరు ప్రాజెక్ట్లో సజీవ జలదృశ్యం ఆవిష్కృతమవు తున్నదని చెప్పారు. కరువు నేలపై సిరులు పండించేందు కు ప్రజలు ఊహించని రీతిలో ఎగువప్రాంతానికి జలా లు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ అపరభగీరథుడు అయ్యాడని కొనియాడారు. సముద్రమట్టానికి 85 అడుగుల ఎత్తున ఉన్న కాళేశ్వరం నుంచి సముద్రమట్టానికి 610 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావడం కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఎగువమానేరులోకి గోదావరి జలాలు రావడం, ముస్తాబాద్ మండలంలోని చెరువులకు జలకళ రావడం చూ స్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఏప్రిల్లో ఎగువ మానే రు పరవళ్లు ఖాయమని, చరిత్రలో ఇది అద్భుత ఘట్టమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలి
అభివృద్ధిలో మోహినికుంటను ఆదర్శంగా తీసుకోవాలని, కేంద్ర పురస్కారం గ్రామంలోని ప్రతి పౌరుడికి ద క్కుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సిరిసిల్ల నియోజకవర్గం ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షిం చారు. సభావేదికపై సర్పం చ్ కల్వకుంట్ల వనజను సన్మానించారు. పాలకవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామాలు అభివృద్ధిలో పోటీపడేలా ప్రజాప్రతిధులు కృషి చేయాలని సూచించా రు. హరిదాస్నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ తెడ్డు అమృతను మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు విధులు నిర్వర్తిస్తూ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రా మాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని సూచిం చారు. హరిదాస్నగర్ పంచాయతీ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
కర్షకులకు మంచి రోజులు
రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డ కేసీఆర్ సీఎంగా ఉండడం వల్లే రైతు పక్షపాతి పాలన కొనసాగుతున్నదని, ఆయన కృషితోనే తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు గత ప్రభుత్వాలు ఏమీ ఇవ్వలేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ రైతులకు వివిధ పథకాలతో ఉల్టా పైసలు ఇస్తున్నారని కొనియాడారు. తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు రాష్ట్రంలో 2,600 రైతు వేదికలను నిర్మించి వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తున్నామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా రైతులకు సలహాలు సూచనలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్లో కేవలం ఎనిమిది గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పారు. ముస్తాబాద్లో తన నానమ్మ-తాతయ్య కల్వకుంట్ల వెంకటమ్మ-రాఘవరావు స్మారకార్థం రైతువేదిక నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లో తన నానమ్మ-తాతయ్య పేరుమీద రైతు వేదికలను నిర్మించినట్లు గుర్తుచేశారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నారన్నారు. అయినా ప్రతిపక్షనేతలు సీఎం కేసీఆర్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి గ్రామాల్లో జరిగే అభివృద్ధిని చూపించి నోళ్లు మూయించాలని సూచించారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా వు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా ఆర్బీఎస్ కన్వీనర్ గడ్డం నర్స య్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీలు జనగామ శరత్రావు, చీటి లక్ష్మణ్రావు, జడ్పీటీసీలు గుం డం నర్సయ్య, పిల్లి రేణుక, ముస్తాబాద్ మండల ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, పోత్గల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు : మమతా
కొల్హాపూర్ లో ఆ పెళ్లిపైనే చర్చ.. ఎందుకో తెలుసా?