సూర్యాపేట టౌన్, ఎప్రిల్ 19 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో సోమవారం 4270 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ కోటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లాలో కొవిడ్ టీకా వేసుకునేందుకు 2 లక్షల మందిని అర్హులుగా గుర్తించగా .. ఇప్పటివరకు 62,699 మంది టీకా తీసుకున్నారని.. ఇంకా సుమారు 1.37 లక్షల మంది తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వేస్తున్నారని, ప్రైవేట్ దవాఖానల్లో రూ. 250 (వ్యాక్సిన్ రుసుము 150 కాగా సేవల రుసుము 100) చెల్లించి వ్యాక్సిన్ పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ కేంద్రాలు, రెండు ప్రైవేట్ కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు.
టీకా కోసం జనం క్యూ..
నేరేడుచర్ల, ఏప్రిల్,19: మండల కేంద్రంలో పది రోజులుగా వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రారంభదశలో వ్యాక్సిన్ కోసం ప్రతిరోజూ 10 నుంచి 20మంది మాత్రమే రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 200 నుంచి 300 చేరింది. ఆదివారం వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం విరామం ప్రకటించగా సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్ఐ యాదవేంద్రరెడ్డి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.