గ్రూప్ ఏర్పాటు చేసిన అదనపు ఎస్పీ సృజన
సంగారెడ్డి, జూన్ 9: లాక్డౌన్లో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు సైబర్ నేరస్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గ్రూప్ ఏర్పాటు చేశామని అదనపు ఎస్పీ సృజన తెలిపారు. బుధవారం జిల్లా సైబర్ కాంగ్రెస్ గ్రూప్ను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అందులో విద్యాశాఖ తరఫున జెండర్ అండ్ ఈక్విటీ కో ఆర్డినేటర్ సుప్రియ, జిల్లా షీ టీమ్ ఇన్చార్జి వినాయక్రెడ్డిని నియమించామన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ లాక్డౌన్లో ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో సెల్ఫోన్లో లేక కంప్యూటర్లో ఏ విధమైనవి చూడాలి… ఏవి చూడకూడదు అనే విషయాలపై ఇంటర్నెట్ వాడే సమయంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఒకవేళ సెల్ఫోన్, కంప్యూటర్ను ఎవరైనా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తే విద్యార్థులు హ్యాకింగ్ నుంచి ఎలా బయట పడాలి అనే విషయాలను నేర్పించాలనే ఉద్దేశంతో సైబర్ కాంగ్రెస్ గ్రూప్ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ గ్రూప్లో జిల్లా నుంచి 50 పాఠశాలలను ఎంపిక చేసి, ఎంపిక చేసిన ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులను సభ్యులుగా చేర్చామన్నారు. వారికి 9 నెలల పాటు ఇంటర్నెట్, సెల్ఫోన్, ల్యాప్టాప్ల వాడకం, సైబర్ నేరాలు-వాటి నుంచి బయట పడే నేర్పుకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం ఈ విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఇతర విద్యార్థులు, కమ్యూనిటీ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారని అదనపు ఎస్పీ సూచించారు.