కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మళ్లీ తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రభుత్వానికి నేతృత్వం వహించేది ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అని తాలిబన్ వర్గాలు చెప్పినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్ శుక్రవారం వెల్లడించింది. ఇక తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కొడుకు ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టనున్నట్లు కూడా రాయ్టర్స్ తెలిపింది. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2010లో ఇతన్ని పాకిస్థాన్లోని కరాచీలో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఆ తర్వాత 2018లో విడిచి పెట్టారు.