జైపూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో రాజస్థాన్లోని అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి భన్వర్ సింగ్ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రకాల పరీక్షలను తదుపరి ఆదేశాలు వెలువరించేంతవరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్ భారిన పడకుండా సమాజంలో అవగాహన పెంపొందించాల్సిందిగా విద్యార్థులకు మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూని విధిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకుక్రితమే 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదా వేశారు. అదేవిధంగా 1 నుండి 9, 11వ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది.