హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తికాదు.. మహా శక్తి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పబ్లిసిటీ కోసం కొందరు కొత్త బిచ్చగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని రేవంత్రెడ్డి, బండి సంజయ్లను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ను ఏ రాయితో కొట్టాలని ప్రశ్నించారు. కేసీఆర్ను తిడితే తాము పెద్దవారమైపోతామని భావించి కొందరు పైశాచికానందం పొందుతున్నారని అన్నారు. పాద యాత్రకు బయల్దేరుతానంటున్న బీజేపీ నాయకుడు.. పల్లె ప్రగతితో పల్లెలు ఎలా పచ్చబడుతున్నాయో చూడాలని హితవు చెప్పారు. గురువారం తెలంగాణభవన్లో భారతీయ మజ్దూర్సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య దాదాపు వెయ్యిమంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. మల్లయ్యకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
కలిసికట్టుగా ఉంటే మరో పార్టీకి..
సంఘానికి నూకలు దక్కవు రాష్ట్రం తెచ్చుకొన్న ఏడేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ సింగరేణిలోని ప్రతి కార్మికుడికి ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చారు. న్యాయపరమైన చిక్కులుంటే.. వాటినీ పరిష్కరించుకుందాం. కేసీఆర్ తప్ప సింగరేణి కార్మికులకు మరొకరు న్యాయం చేయలేదు. ఈ విషయాన్ని కిందిస్థాయి కార్యకర్తలకు తెలియజెప్పాలి. మల్లయ్య బొగ్గు గని కార్మికులకోసమే కాకుండా.. పార్టీ కార్మిక విభాగంలో, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకొంటాం. మనం కలిసికట్టుగా ఉంటే ఇంకొక పార్టీకి గానీ, సంఘానికి గానీ నూకలు దక్కవు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు.. సంఘాలతో కలిసి ముందుకుపోవాలి. కలిసికట్టుగా ఉంటే టీఆర్ఎస్ను, కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా ఎవరికీ ఉండదు.
బీజేపీ అడ్రస్ ఎక్కడ?
బీజేపీ నేతలు ఒక్క దుబ్బాకలో గెలవంగనే.. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు గెలవంగనే ఎగిరెగిరి పడ్డరు. అధికారంలోకి వచ్చేది మేమే అన్నరు. ఆ తర్వాత మూడు ఎన్నికలు వచ్చినయి. నాగార్జునసాగర్లో అంతుచూస్తామంటూ ధూంధాం చేసిన్రు. అక్కడ ఏడుసార్లు గెలిచిన జానారెడ్డి మీద యువకుడు నోముల భగత్ను టీఆర్ఎస్ నిలబెడితే.. 18 వేల ఓట్ల మెజార్టీతో భగత్ను ప్రజలు గెలిపించిన్రు. బీజీపీకి అక్కడ అడ్రస్ కూడా లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, మాజీ ఎంపీలు అంతా కలిసి సాగర్లో ప్రచారంచేస్తే.. వచ్చిన ఓట్లు ఏడువేల చిల్లర. మన మెజార్టీలో సగం కూడా రాలేదు. తర్వాత శాసనమండలికి 77 నియోజకవర్గాల పరిధిలోని పూర్వ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగితే.. పది లక్షల మంది విద్యావంతులు తీర్పుఇచ్చారు. బీజేపీ సిట్టింగ్ సీటును కూడా ఓడగొట్టి.. రెండు సీట్లలోనూ గులాబీ జెండాకు పట్టం కట్టారు. తర్వాత ఏడు మున్సిపాలిటీల్లో ఒక్కచోట కూడా ఎవరికీ సందు ఇవ్వకుండా మొత్తం మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ను గెలిపించారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు ఎంత విశ్వాసం ఉన్నదో తేలిపోయింది. తాత్కాలికంగా వాళ్లో వీళ్లో మిడిసిపాటు ప్రదర్శించొచ్చు. కానీ.. అంతిమంగా తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. ఏ పరిస్థితుల్లో అయినా 20 ఏండ్లుగా నిర్విరామంగా.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని ఎలా సాధించుకోన్నామో.. తాము కలలు కన్న తెలంగాణ కూడా కేసీఆర్తోనే సాధ్యమన్న స్పష్టత ప్రజలకు ఉన్నది.
ఇది పాదయాత్రల సీజన్
తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైంది. బీజేపీ నాయకుడు, ఇంకొకాయన, ఇంకొకామె పాదయాత్రలు చేస్తారట. పాదయాత్రలు ఆరోగ్యానికి మంచిదే. కరోనా తర్వాత ఆరోగ్యం కూడా సెట్ అవుద్ది. బీజేపీ నేత పాదయాత్రలో భాగంగా ఊరూరికి పోయి పల్లెలు ప్రగతిబాటన ఎట్లా ముందుకుపోతున్నాయో తప్పకుండా చూడు. ప్రతి ఊళ్లో ఒక నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు.. రైతు వేదిక.. డంప్యార్డ్.. కంపోస్ట్ ఉన్నది. నీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నదా? నువ్వెక్కడికి పోయినా.. పచ్చదనం పరుచుకొని చెట్లు స్వాగతం పలుకుతాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో హరితహారం ఉన్నదా? ఏ ఊరికిపోయినా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్.. పదిశాతం బడ్జెట్ పచ్చదనానికి పెట్టిన పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? ఒకటికాదు.. రెండు కాదు.. రూ.7500 కోట్లు రైతుబంధు స్వీకరించిన 61 లక్షల రైతులు నీకు కనిపిస్తరు. రైతుబీమా ద్వారా 39 లక్షల రైతన్నలు ధీమాతో ఉన్నరు. ఏ ఊరికి పోయినా 24 గంటల కరెంట్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నది. నవ్వుతూ పలకరించే మిషన్ కాకతీయ ఉన్నది. పెరిగిన మత్స్య సంపదతో సంతోషంగా ఉన్న మత్స్యకార సోదరులు, గొర్రెల యూనిట్లు పొందిన మా యాదవ సోదరులు కనిపిస్తరు. దళిత సాధికార కార్యక్రమంతో సంతోషంగా ఉన్న దళిత సోదరులు కనిపిస్తరు. కేసీఆర్ దయతో పంచాయతీలుగా మారిన తండాలు, గూడేలు స్వాగతం పలుకుతాయి. ఏమన్నంటే.. మీ ప్రతి కార్యక్రమంలో మేం లేమా అంటరు. నువ్వు చెప్పింది నిజమే అయితే, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, డబుల్బెడ్రూం ఇండ్లు, మిషన్ కాకతీయ, భగీరథ ఎందుకు లేదు?
తెలంగాణ బలిదేవత అన్నదెవరు?
కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొత్తగా ఒకాయన పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. కొందరు.. అది టీపీసీసీ కాదు.. టీడీపీసీసీ అంటున్నరు. సోనియమ్మను తెలంగాణ తల్లి అని ఇప్పుడు చెప్తున్న ఇదే పెద్ద మనిషి.. అదే సోనియమ్మను పట్టుకొని.. తెలంగాణలోని 1200 మందిని బలితీసుకున్న బలిదేవత అన్నడు. రేపో ఎల్లుండో చంద్రబాబును తెలంగాణ తండ్రి అని కూడా చెప్తడు. ఆయనకు పాత వాసనలు పోతలేవు. అసలు ఆయన తెలుగుదేశంలో ఉన్నడో, కాంగ్రెస్లో ఉన్నడో, అది తెలుగు కాంగ్రెస్సో ఏమో నాకైతే తెల్వదు. కొత్త సినిమా రిలీజ్ రెండురోజులుంటది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆయనేదో ప్రధానమంత్రి పదవి పొందినట్టు బిల్డప్ ఇస్తున్నడు. మా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసిండ్రు అంటడు. కొనుడు.. అమ్ముడు గురించి రేవంత్కంటే బాగా ఎవరికి తెలుస్తది? ఓటుకు నోటు కేసులో దేశం అంతా చూడంగ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగ.. నీతి మాటలు మాట్లాడుతున్నడు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతా అంటవ్.. మరి నిన్ను దేనితో కొట్టాలి? అడ్డంగా దొరికి చిప్పకూడు తిన్న దరిద్రుడు మాట్లాడితే ఎట్లా? చూడటానికికైనా.. వినడానికైనా.. కొద్దిగా సిగ్గుపడాల్నా లేదా? 70 ఏండ్లు దేశాన్ని గబ్బు పట్టిస్తే.. ఏడేండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే శుభ్రంచేస్తున్నది. ప్రజలిప్పుడే సంతోషంతో బతుకుతున్నరు. 24 గంటల కరెంట్ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నదా? తెలంగాణలో ఆరేండ్ల నుంచి 24 గంటల కరెంట్ ఇస్తున్నం.. కనపడటం లేదా? ఏమన్నంటే ‘తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిపోయింది.. గుంజుకునుడే’ అంటున్నవు. ప్రజలేమైనా నోట్ల కట్టలా గుంజుకోనీకి? నోట్ల కట్టలతోని ఎమ్మెల్యేను కొనటానికి పోయి దొరికిపోయినట్టే.. గవ్వే నోట్ల కట్టలతో నువ్వు పీసీసీ అధ్యక్ష పదవిని తెచ్చుకున్నవని నీ పార్టీ ఎంపీలే అంటున్నరు. అటువంటి రేవంత్ కేసీఆర్ నుంచి గుంజుకుంటడట! కేసీఆర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా రేవంత్కు లేదు.
టీఆర్ఎస్సే లేకపోతే మీ బతుకులేమయ్యేవి?
‘టీఆర్ఎస్ లేకపోతే టీబీజేపీ ఎక్కడిది? టీపీసీసీ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే ఈ పదవులు వచ్చేవా? మిమ్ములను కానినోడు ఎవడు? ఏపీలో మిమ్మల్ని గంజిల ఈగలెక్క తీసిపారేద్దురు. అటువంటిది ఇయ్యాల పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటరు. ఆయనకేదో పదవి దొరికింది. దానికి ర్యాలీలు, అట్టహాసం, పేపర్లు, ప్రకటనలు.. ఇచ్చుకో.. మాకేం అభ్యంతరంలేదు. కానీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. టీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా విలీనమయ్యారు. వాళ్లను రాళ్లతో కొడతా అంటున్నవు. నువ్వు టీడీపీలో గెలిచి కాంగ్రెస్లో చేరినప్పుడు రాజీనామా చేసినవా? రాజస్థాన్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అశోక్ గెహ్లాట్ విలీనం చేసుకున్నరు. రాళ్లతోని కొట్టుడు ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలి? రాజస్థాన్లో కాంగ్రెస్ వాళ్లను కొట్టాలా? పార్టీ మారినప్పుడు రాజీనామా చేయని నిన్ను కొట్టాల్నా? పీసీసీ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. కుసంస్కారంగా బజారు భాషలో చిల్లర మల్లరగా మొరిగే నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సింగరేణిని ఎట్లా అభివృద్ధి చేసుకున్నమో.. అట్లనే అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ ముందుకుపోదాం. మన వెంట కేసీఆర్ ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వెంకటేశ్వర్రెడ్డి, కే వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి రూప్సింగ్, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్లు
ఈ మధ్య మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. ఏనుగు ముందు పోతుంటే కుక్క మొరిగినట్టు.. కేసీఆర్ అనే ఒక మహాశక్తి ముందు నడుస్తుంటే.. కొందరు నిన్నామొన్న పదవులొచ్చినోళ్లు ఎగిరెగిరిపడుతున్నరు. ఒకాయన కేసీఆర్ దగ్గరికెళ్లి గుంజేసుకునుడే అంటడు. కేసీఆర్ను తిడితేనే పెద్ద నాయకులైపోతాం.. పేపర్లు రాస్తాయి.. టీవీల్లో బ్రేకింగ్లు వస్తాయనే చిల్లర ఆలోచనలు చేస్తరు. కేసీఆర్ను గెలవాలంటే.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించుడు నేర్చుకోవాలి. కేసీఆర్కంటే తెలంగాణకు ఎక్కువ చేయగలుగుతామనే విశ్వాసాన్ని కలిగిస్తే రెండు ఓట్లు రాల్తాయేమో. కానీ, వీళ్లు కేసీఆర్ను తిట్టి శునకానందం, పైశాచికానందం పొందుతున్నారు.
కేసీఆర్ అంటే ఆషామాషీ కాదు
తెలంగాణలో సీఎంగా ఉన్నది రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారుడని మరచిపోవద్దు. మీరు కొట్లాడుతున్నది ఆషామాషీ నాయకుడితో కాదు. 2001లో గులాబీ జెండా ఎత్తినప్పటినుంచి నేటి వరకు తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీ పడకుండా.. వైఎస్, చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి వంటివారితో ధీరోదాత్తంగా పోరాడి అందరినీ తట్టుకొని, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ వ్యవస్థలను ఒక్కటి చేసి, తెలంగాణ సమాజాన్ని ఏకంచేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్. అట్లాంటి నేతతో తలపడాలంటే డైలాగులు కొడితే సరిపోదు.
సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపేది?
దేశ రక్షణలో సైన్యం ఎటువంటి పాత్ర పోషిస్తుందో సింగరేణి కార్మికుల పాత్ర కూడా అలాంటిదే. వారికిచ్చినట్టే ఆదాయం పన్ను మినహాయింపు చేయాలని కేంద్రాన్ని అడిగాం. అసెంబ్లీలో తీర్మానంచేసి పంపించాం. బీజేపీ సర్కారు ఎందుకు పట్టించుకోలేదు? తెల్లారి లేస్తే కేసీఆర్ మీద పనికిమాలిన మాటలు మాట్లాడుడు కాదు. తెలంగాణకు ఏం చేశారో బీజేపీ నాయకులు చెప్పాలి. బీజేపీ నేతలు తిరగండి. నేర్చుకోండి.. తప్పులేదు. కేసీఆర్ 2018లో రైతుబంధు పెడితే రెండేండ్ల తర్వాత వాళ్లు పీఎం కిసాన్ ప్రోగ్రాం పెట్టారు. మనం మిషన్ భగీరథ పెడితే వాళ్లు కాపీ కొట్టి జల్జీవన్ మిషన్ అని పెట్టుకున్నరు. తప్పేంలేదు. దేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే బిడ్డలుగా గర్వపడుతున్నాం.
హుజూరాబాద్కు వెయ్యి కోట్లు ఇవ్వు.. వద్దన్నమా?
జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే బాబర్, అక్బర్ గుర్తుకొస్తరు. హుజూరాబాద్ ఎన్నికలు వస్తే క్విట్ ఇండియా ఉద్యమం రోజున స్టార్ట్ చేస్తరట. ప్రతి దానికీ పనికిమాలిన లాజిక్కులు మాట్లాడటం కాదు. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్తం. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిందా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇచ్చారా? హైదరాబాద్లో ఐటీఐఆర్ను ఎందుకు రద్దుచేశారు? బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టినారా? హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నవని తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నదంటున్నరు.. మేమంటే చిన్నోళ్లం.. ఒక రాష్ర్టాన్ని నడుపుతున్నం. బీజేపీని ఎవరన్నా ఆపుతున్నరా? తెలంగాణకు వేల కోట్లు ఇస్తే అడ్డుపడుతున్నమా? హుజూరాబాద్కు వెయ్యికోట్ల ప్యాకేజీ ప్రకటించు.. వద్దన్నమా? కరీంనగర్ పార్లమెంట్కు పైసలివ్వు.. వద్దన్నమా? నువ్వు ఇవ్వకుండా ఇచ్చేటోని మీద వెటకారం మాటలెందుకు? ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పల్లెకు ఇవ్వలేదు? ఏ పట్టణానికి ఇవ్వలేదు? ఏ ఇంటికి సాయం చెయ్యలేదు? పేదవాళ్లు ఎక్కడున్నా వెతికి వెతికి సహాయం చేసింది కేసీఆర్. కేసీఆర్ది మనసున్న సంక్షేమ ప్రభుత్వం. ఎవరెన్ని మాట్లాడినా.. కేసీఆర్ బయటకెళ్లి నాలుగు ఊర్లు తిరగంగనే అందరి నోళ్లు మూతపడ్డవి.