కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ సారథ్య బాధ్యతలు ఓ కరుడుగట్టిన ఉగ్రవాది చేతుల్లోకి వెళ్లాయి. తాలిబన్ చర్యల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే ‘రేబరీ షురా’ గ్రూప్ చీఫ్, ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉగ్రవాద జాబితాలో ఇంకా కొనసాగుతున్న ముల్లా మహమ్మద్ హాసన్ అఖుంద్ను అఫ్గాన్ తాత్కాలిక ప్రధానిగా నియమిస్తున్నట్టు తాలిబన్ నేతలు వెల్లడించారు. తాలిబన్ సహవ్యవస్థాపకుడు, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయం ఛైర్మన్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, తాలిబన్ మరో కీలక నేత మవ్లావీ అబ్దుల్ సలామ్ను తాత్కాలిక ఉప ప్రధానులుగా నియమించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కాబూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తాలిబన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ప్రస్తుత క్యాబినెట్ తాత్కాలికమైనదేనని, పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఓమర్ కుమారుడు ముల్లా యాకూబ్ను రక్షణమంత్రిగా, అమెరికా ప్రకటించిన ఉగ్రవాద సంస్థ ‘హక్కానీ నెట్వర్క్’ కీలకనేత సిరాజుద్దీన్ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా, తాలిబన్ కీలక నేతలు మవ్లావీ అమీర్ఖాన్ని విదేశాంగ మంత్రిగా, ముల్లా హెదాయితుల్లా బద్రీని ఆర్థికమంత్రిగా, షేక్ మవ్లావీ నూరుల్లా మునీర్ని విద్యాశాఖ మంత్రిగా నియమించినట్టు చెప్పారు. దాదాపు 30 శాఖలకు మంత్రులను ప్రకటించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుంది? ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహణ ఉంటుందా? తదితర విషయాలపై స్పష్టతనివ్వలేదు.
షరియా చట్టం ప్రకారమే పాలన: అఖుంద్జాదా
అఫ్గాన్లో కొత్తగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో.. ‘షరియా చట్టం’పై తాలిబన్ సుప్రీం నాయకుడిగా భావిస్తున్న హిబతుల్లా అఖుంద్జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో ఇస్లామిక్ నిబంధనలు, షరియా చట్టం అమలయ్యేలా కొత్త ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్గాన్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లడానికి ప్రయత్నించడాన్ని మానుకోవాలి. ఇతర దేశాలతో ఇస్లామిక్ ఎమిరేట్కు ఎలాంటి సమస్యా లేదు. అఫ్గాన్ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. కాగా, తాలిబన్ల పాలనలో మళ్లీ క్రూరమైన షరియా చట్టం అమల్లోకి వస్తుందేమోనని భయపడుతున్న అఫ్గాన్ మహిళలకు అఖుంద్జాదా తాజా ప్రకటన ఆందోళన కలిగిస్తున్నది.
ఎవరీ అఖుంద్?
తాలిబన్ అనుబంధ సంస్థల్లో నాయకులను నియమించే ‘రేబరీ షురా’ గ్రూప్ చీఫ్గా ముల్లా మహమ్మద్ హాసన్ అఖుంద్ వ్యవహరిస్తున్నారు. గత 20 ఏండ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. అఫ్గాన్ ప్రధానిగా ఈయన్ని తాలిబన్ అగ్రనాయకుడు ముల్లా హెబతుల్లా ప్రతిపాదించినట్టు సమాచారం. కాందహార్కు చెందిన అఖుంద్ను తాలిబన్ దళాల శిక్షణకు ఆద్యుడిగా పిలుస్తారు. 1996-2001 తాలిబన్ల హయాంలో విదేశాంగ మంత్రిగా, ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, అధినాయకత్వం సూచనలతో అత్యంత తక్కువ కాలమే వీటిలో కొనసాగారు. గత తాలిబన్ హయాంలో సరైన పదవి ఇవ్వకపోవడం వల్లే అఖుంద్కు ఈసారి ప్రధాని పదవిని కట్టబెట్టినట్టు సమాచారం. 2001 మార్చిలో బమియాన్ బుద్ధ విగ్రహాల ధ్వంసరచనలో అఖుంద్ కీలక పాత్ర పోషించారు.
పాక్పై అఫ్గానీల కన్నెర్ర
తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యంపై అఫ్గాన్లు నిప్పులు చెరుగుతున్నారు. కాబూల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాకిస్థాన్ సర్కార్, ఆ దేశ నిఘా విభాగం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి వ్యతిరేకంగా నినదించారు. పంజ్షీర్ ప్రావిన్స్పై పాక్ యుద్ధవిమానాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. ‘పాకిస్థాన్ నశించాలి’, ‘నిర్బంధం మాకొద్దు’, ‘వెనుకుండి ఒకరు ఆడించే కీలుబొమ్మలాంటి ప్రభుత్వం మేము కోరుకోవట్లేదు’, ‘మాకు స్వేచ్ఛ కావాలి. అల్లా అక్బర్’ అంటూ గళమెత్తారు. పాక్ ఎంబసీలోని సిబ్బంది వెంటనే అఫ్గాన్ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో మహిళలు కూడా పెద్దయెత్తున పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన తాలిబన్లు.. నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాబూల్తో పాటు, బల్ఖ్, దయికుంది ప్రావిన్సులలో కూడా పాక్ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. ఆఫ్గాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ ఫైజ్ హమీద్ గతవారం తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ బరాదర్ను కలవడం ఈ నిరసనలకు కారణమైంది. అలాగే, పంజ్షీర్ ఆక్రమణలో భాగంగా తాలిబన్లకు పాక్ వైమానిక సాయం చేసిందన్న వార్తలు వీటికి మరింత ఆజ్యం పోశాయి.