కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని దుర్శేడ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొత్తపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆర్డీవో ఆనంద్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, బుధ, గురువారం వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. 45 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రకారం 45 ఏళ్లుపైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. దుర్శేడ్తో పాటు నల్లగుంటపల్లి, ఇరుకుల్ల, గోపాల్పూర్, బొమ్మకల్, చేగుర్తి, మొగ్దుంపూర్ గ్రామాల ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. డీఎల్పీవో హరికిషన్ మాట్లాడుతూ, రోజుకు 350 మందికి పైగా వ్యాక్సిన్ వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా, కొవిడ్ టీకాకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శిబిరాన్ని ఆర్డీవోతో పాటు తహసీల్దార్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో పవన్కుమార్, ఎంపీవో రాజగోపాల్రెడ్డి, ఆర్ఐ భవాని, వైద్యులు శిరీష, నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, డైరెక్టర్ గాజుల అంజయ్య, వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు సుశ్మిత, కిరణ్కుమార్రావు తదితరులు పాల్గొన్నారు.