వారం రోజుల్లో ముదిరిన ఎండలు
జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40
కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్చి నుంచే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడు జనంతో కిక్కిరిసి పోయో రోడ్లన్నీ ఎండ తీవ్రతలో జనం లేక బోసిపోయాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎండలు మరింత మండి పోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క సారిగా ఊష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు సెల్సీయస్ పెరుగడం గమనార్హం. బుధవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4 డిగ్రీలు నమోదైంది. దాహార్తిని తీర్చుకునేందుకు జ్యూస్ సెంటర్లు, శీతల పానియాల విక్రయ కేంద్రాల వైపు పరుగులు తీశారు. తాండూరు పట్టణంలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తప్పనిసరి పరిస్థితిలో పనులకు వెళ్లాల్సి వస్తే రక్షణగా టోపీలు, గొడుగులు, కండువాలు తలపై కప్పుకొని బయటికి వస్తున్నారు. కార్మికులు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు ఎండల వేడిమి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు సూచించిన ఆరోగ్య నియమాలు పాటించాలి. అత్యవసరం అనుకుంటే తప్ప బయటకు వెళ్లకూడదు. గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాంతులు, అలసట, తలనొప్పి, కండరాల్లో తిమ్మిరులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడుని సంప్రదించాలి.