స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రజాసేవలో పోలీస్శాఖ: నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పర్యటన
పోలీస్ సిబ్బందికి సలహాలు, సూచనలు
కొత్తగూడెం క్రైం, మే 23 : కరోనా వైరస్ నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటించాలని తెలంగాణ నార్త్ జోన్ ఐజీ వై. నాగిరెడ్డి అన్నారు. కరోనాని కట్టడి చేయడంలో భాగంగా పోలీస్ అధికారులు అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనల తీరు పరిశీలించేందుకు ఆయన ఆదివారం ఆకస్మికంగా జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా ఐజీ నాగిరెడ్డి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్పోస్ట్ని సందర్శంచి అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు స్వీయనియంత్రణతో బాధ్యతగా కరోనాని కట్టడి చేసేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా కరోనా వైరస్ నియంత్రణకు మాస్కు ధరించడం, శానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉన్న లాక్డౌన్ సడలింపునుదుర్వినియోగం చేయకుండా, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే అత్యవసర సేవలు, వ్యవసాయ ఎగుమతి, దిగుమతులతో పాటు మీడియాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ప్రజలు లాక్డౌన్ సమయంలో వైద్యశాలలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. మిగతా సందర్భాల్లో ఎవరైనా అనాలోచితంగా, ఎలాంటి పనులు లేకపోయినా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల చెక్పోస్టులను సందర్శించి ఆయా ప్రాంతాల స్థితిగతులు, అక్కడ ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇదే రీతిలో లాక్డౌన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ (అడ్మిన్) బిరుదరాజు రోహిత్రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్ బాబు, కొత్తగూడెం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ డి. వేణుచందర్, ఎస్సైలు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.
పోలీసులకి ప్రజలు సహకరించాలి..
జూలూరుపాడు, మే 23 : లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తూ పోలీసులకి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని నార్త్జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వినోభానగర్ చెక్పోస్ట్ను ఆదివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. చెక్ పోస్టు వద్ద ఉన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వ్యవసాయ రంగాలకు సంబంధించిన వాహనాలు, ఈ పాస్ పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. జూలూరుపాడు సీఐ నాగరాజు, ఏన్కూరు, జూలూరుపాడు ఎస్సైలు, శ్రీకాంత్, పొదిశెట్టి శ్రీకాంత్, ట్రైనీ ఎస్సై టీవీఎన్రావు పోలీసు సిబ్బంది ఉన్నారు.
పెట్రోల్బంక్ను తనిఖీ చేసిన ఐజీ
పాల్వంచ, మే 23 : ఉభయ జిల్లాల సందర్శన నిమిత్తం వచ్చిన నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదివారం సాయంత్రం పాల్వంచలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ను పరిశీలించారు.
భద్రాచలం వెళ్తూ మార్గం మధ్యలో పాల్వంచ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న బంక్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభించనున్న దృష్ట్యా ఏ విధంగా నిర్వహన చేస్తారని వివరాలు తెలుసుకున్నారు.