ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మియామీ వద్ద ఓ భారీ బిల్డింగ్ కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 145 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటి వరకు 18 మంది మరణించినట్లు గుర్తించారు. బిల్డింగ్ కూలిన ఘటనకు చెందిన బాధితులను అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. బిల్డింగ్ శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందన్నారు. ఏ కారణం చేత ఆ బిల్డింగ్ కూలిందో తెలుసుకోవాలన్నారు. 18 మంది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. అయితే గురువారం వాతావరణం అనుకూలించని కారణంగా.. రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ శిథిలాల నుంచి ఒక్కర్ని కూడా ప్రాణాలతో రక్షించలేదు.
మిగితా బిల్డింగ్ను కూల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యావత్ దేశం మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతోందని బైడెన్ అన్నారు. ప్రజలంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని, ఏదైనా అద్భుతం జరుగుతుందని భావిస్తున్నారన్నారు. శిథిలాల కింద ఎవరో ఒకరు బ్రతికి ఉంటారని, శ్వాస తీసుకుంటూ ఉంటారని, వారిని రక్షిస్తామని బైడెన్ తెలిపారు. బిల్డింగ్ కూలి 8 రోజులు గడిచినా.. 40 ఏళ్ల క్రితం నాటి ఆ బిల్డింగ్ ఎందుకు కూలిందో ఇంకా తెలియరాలేదు. మియామిలోని సర్ఫ్సైడ్ పట్టణంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. సముద్రం మట్టం పెరిగిందని, వాతావరణ మార్పులు కారణమని కొందరు అంటున్నా .. ఆ ఘటనపై పూర్తి సమాచారం అందడం లేదు. కానీ ఆ బిల్డింగ్ లైఫ్ అయిపోయినట్లు ఏప్రిల్లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.