వీసీలో సమీక్షించిన కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వైద్యాధికారులతోపాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. రెండో దశలో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పకడ్బందీగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైద్యులు కొవిడ్ పాజిటివ్ రోగులను రోజుకు కనీసం రెండు సార్లు తప్పనిసరిగా పరీక్షించాలని చెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు కొవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. గతంలో మాదిరి ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లను సందర్శించాలని చెప్పారు. కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంచార వైద్య వాహనాలు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని మందులు ఆక్సిజన్, వ్యాక్సినేషన్కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు, యాక్టివ్ కేసు లు, బెడ్లు, ఆక్సిజన్ కరోనా, పాజిటివ్ రోగులకు ఇస్తున్న చికిత్స ప్రైవేటు దవాఖాన సేవ లు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు వ్యాక్సినేసన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వీసీకి డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో శశికాంత్, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, నోడల్ అధికారి డాక్టర్ జీవన్ ఉన్నారు.