హెల్సింకి: అది 1968వ సంవత్సరం. ఫిన్లాండ్లోని సువోంటకా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరుపుతుండగా ఒక చోట సమాధి బయటపడింది. దాన్ని వెలికితీసిన పరిశోధకులు అందులో మహిళా వస్త్రధారణతో ఉన్న ఒక వ్యక్తి శిలాజాన్ని కనుగొన్నారు. ఆ వ్యక్తి మరణించి అప్పటికే కనీసం 1000 ఏండ్లు గడిచిపోయి ఉంటుందని అంచనావేశారు. ఆ వ్యక్తి ఎడమవైపున పిడిలేని ఒక రాజ ఖడ్గం, సమాధిలోనే ఇంకో పక్కన మరొక ఖడ్గాన్ని గుర్తించారు. వస్త్రధారణ, శిలాజం ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆడమనిషిగా నిర్ధారించారు. అప్పటికాలంలోనే మహిళలు ఏకఛత్రాధిపత్యంతో రాజ్యాలను పాలించేవారని అబ్బురపడ్డారు. అయితే, ఈ సమాధిని పరిశీలించిన మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం అందులో ఉన్నది మహిళ కాదని వాదించారు. దీంతో గత ఐదు దశాబ్దాలుగా ఆ సమాధి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
సమాధిలో ఉన్నదెవరంటే?
సమాధిలోని వ్యక్తి లింగం ఏమిటన్నదానిపై మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు డీఎన్ఏ, మట్టి నమూనాలు, వెంట్రుకలు తదితరాలను సేకరించి పరిశోధనలు చేపట్టారు. విస్తృత విశ్లేషణల అనంతరం.. సమాధిలో ఉన్నది ‘నాన్-బైనరీ పర్సన్’ కావొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. వెయ్యేండ్ల క్రితం కూడా నాన్-బైనరీ వాళ్లను.. ప్రజలు రాజ్యాధినేతలుగా అంగీకరిస్తూ, గౌరవించేవారని తెలియడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పరిశోధకుడు ఉల్లా మొయిలేనెన్ పేర్కొన్నారు.
‘నాన్-బైనరీ పర్సన్’ అంటే?
జీవుల శారీరక అవయవాలు, లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా ఆడ, మగగా విభజిస్తారు. డీఎన్ఏలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్లు ఉంటే ఆడ జీవిగా, ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్ ఉంటే మగ జీవిగా పుడుతారు. అయితే, ‘క్లానేఫెల్టర్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడేవారిలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్లతో పాటు మరొక ‘వై’ క్రోమోజోమ్ ఉంటుంది. బాల్యంలో వీళ్లు మగ పిల్లల్లా కనిపించినప్పటికీ, కౌమార దశకు వచ్చేసరికి శారీరకంగా సుకుమారంగా తయారవ్వడం, శరీరంపై వెంట్రుకలు మాయమవ్వడం జరుగుతుంది. సంతానోత్పత్తిని కూడా వృద్ధి చేసుకోలేరు.