ఎస్సీ, ఎస్టీలకు వరం..ఉచిత భూ పంపిణీ
పాలమూరు జిల్లాలో 272 ఎకరాలు పంపిణీ
పండుగలా రైతన్నల వ్యవసాయం
మహబూబ్నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు వారంతా కూలీలు.. ప్రస్తుతం భూ యజమానులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల పంపిణీ వారి జీవితాలను మార్చేసింది. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు భూమి కొనుగోలు పథకం కింద మూడెకరాలు ఇవ్వాలని సంకల్పించి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు రూ.10,04,87,000 ఖర్చు చేసి 272 ఎకరాలు కొనుగో లు చేసి 121 మందికి పంపిణీ చేశారు. అంతేకాకుండా మొదటి పంట చేతికొచ్చే వరకు సాయాన్ని అందించారు.
కరివెనలో 78 ఎకరాల పంపిణీ..
భూమి కొనుగోలు పథకంలో భాగంగా భూత్పూర్ మం డలం కరివెన గ్రామంలో 2014-15 నుంచి 2016-17 వరకు సుమారు 26 మంది ఎస్సీ మహిళలకు 78 ఎకరాల ను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో ఈ పేద రైతులంతా ఇతరుల పొలాలకు కూలీ పనులకు వెళ్లేవారు. మరికొందరు ఇతర వృత్తులను చేసుకుని జీవనం కొనసాగించేవారు. నేడు వారంతా భూ యజమానులయ్యారు. కరివెన గ్రామంలో 367, 610, 537, 538, 539, 540, 29 స ర్వే నంబర్లలో 75 ఎకరాల భూమిని 26 మందికి పంపిణీ చేశారు. ఈ భూముల్లో భూగర్భ జల శాఖ సూచన మేరకు ఆరు బోర్లను తవ్వించి సబ్ మెర్సిబుల్ పంపులు బిగించి ఉ చితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా 33 కేవీ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఐదు మంది రైతులు సొం తంగా బోర్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తున్నారు. ఈ భూములన్నీ కరివెన రిజర్వాయర్కు దగ్గర్లో, సారవంతంగా ఉండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమితో తాము సంతోషంగా జీవిస్తున్నామని మహిళా రైతులు చెబుతున్నారు. ఇటీవల మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు కరివెన గ్రామాన్ని సందర్శించి ఎస్సీ మహిళలు సాగుచేస్తున్న భూములను పరిశీలించారు.