న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల్లలు, వృద్ధులను ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పాలని యూనియన్ నాయకులను తాను చాలా సార్లు కోరినట్లు తోమర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండవ దశ ప్రారంభమైందని, రైతులు, యూనియన్లు కొవిడ్ ప్రోటోకాల్ అనుసరించాలని కోరారు. రైతులు తమ నిరసనను వాయిదా వేసి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని అన్నారు.
వ్యవసాయ చట్టాల్లోని సమస్యాత్మక అంశాలపై చర్చించి మార్పులు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని మంత్రి తోమర్ తెలిపారు. అయితే రైతు సంఘాలు దీనికి అంగీకరించలేదని, కారణం కూడా చెప్పలేదన్నారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు లేదా సంఘాల నుంచి అనుకూలమైన స్పందన రానప్పుడు మాత్రమే ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. అయితే ఎలాగైనా నిరసనలను కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయని, దీంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదని మంత్రి తోమర్ వ్యాఖ్యానించారు.