జిల్లావ్యాప్తంగా కార్మిక జెండాల ఆవిష్కరణ
కోదాడలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
జిల్లావ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే వాడవాడలా వివిధ రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాల జెండాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కోదాడ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొని జెండా ఎగురవేశారు. సూర్యాపేటలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్కేవీ అనుబంధ సంఘాలైన ఆటో యూనియన్ జెండాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, సీడబ్ల్యూసీ గోదాం వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సీపీఎం కార్యాలయంలో మల్లు లక్ష్మి, సూర్యాపేట మండలం గాంధీనగర్లో డీసీఎంసీ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ కార్మికుల జెండాను ఎగురవేశారు. కోదాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే నయీం జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ జెండాను డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య ఉద్యోగుల సంఘం జెండాను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బూతరాజు సైదులు ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడి అసువుల బాసిన అమరులను స్మరించుకున్నారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధానాలు మానుకుని కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్మిక సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-నమస్తేతెలంగాణ, నెట్వర్క్