ప్రస్తుత గ్రాండ్ ఎంట్రెన్స్లు సరిగ్గాలేవు
జాతీయ రహదారులపై ఏర్పాటుకుకేంద్రానికి ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
వరంగల్, జూన్7 : జాతీయ రహదారిపై నగర ప్రవేశ ద్వారాల వద్ద విశాలమైన బటర్ఫ్లై జంక్షన్లు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సోమవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్యతో కలిసి బటర్ఫ్లై జంక్షన్ల నిర్మాణం, మాస్టర్ప్లాన్, గ్రాండ్ ఎంట్రెన్స్లపై చర్చించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద స్మార్ట్సిటీ అయిన వరంగల్ నగరంలోని జాతీయ రహదారి 163పై ఢిల్లీపబ్లిక్ స్కూల్, భీమారం, దామెర వద్ద నిర్మిస్తున్న గ్రాండ్ ఎంట్రెన్స్లు సరిగ్గా లేవన్నారు.
ఈ మూడు ప్రాంతాల్లో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా గ్రాండ్ ఎంట్రెన్స్ పాయింట్లపై బటర్ఫ్లై జంక్షన్లను నిర్మించాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. దీంతోపాటు జాతీయ రహదారి 563పై ఉన్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం రహదారులపై ఎల్లాపూర్-హసన్పర్తి రహదారి మధ్యలో, నర్సంపేట- వరంగల్ రహదారి, ఖమ్మం జాతీయ రహదారి బొల్లికుంట వద్ద విశాలమైన బటర్ ఫ్లై జంక్షన్లను నిర్మించాలని సూచించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అవసరమైయితే నిట్ అధికారుల సహకారంతో భూ సేకరణకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. బటర్ఫ్లై జంక్షన్ల కోసం మూడు, నాలుగు నమూనాలు రూపొందించాలన్నారు. జూలై 3న మళ్లీ సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని వినోద్కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ పాండురంగారావు, తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అడిషనల్ డైరక్టర్ జనరల్ ఎస్ఎస్ రెడ్డి, జాతీయ రహదారుల శాఖ డైరక్టర్ కిశోర్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్
హన్మకొండ, జూన్ 7 : కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీనంగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ బోగం సుగుణ, నాయకుడు వెంకటేశ్ టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. సోమవారం హన్మకొండలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి వినోద్కుమార్ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సుగుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ శ్యాం పాల్గొన్నారు.
వెబ్సైట్ ప్రారంభించిన వినోద్కుమార్
వరంగల్ బార్ అసోసియేషన్ లోగోను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రారంభించారు. సోమవారం హన్మకొండలోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెబ్సైట్ విధి విధానాలపై చర్చించిన అనంతరం వినోద్కుమార్ పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పశుపతి, కార్యదర్శి విజయ్, సీనియర్ న్యాయవాదులు రవికుమార్, జనార్దన్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్రావు పాల్గొన్నారు.