గౌహతి: మయన్మార్లో ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న అక్కడి సైన్యాధికారులు భారీ బీభత్సం సృష్టిస్తున్నారు. సైనిక ఊచకోత తట్టుకోలేకపోతున్న జనం.. ఆ దేశ విడిచి వెళ్తున్నారు. అయితే భారత్లోకి మయన్మార్ శరణార్థులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మయన్మార్ శరణార్థులకు ఎటువంటి క్యాంపులు ఏర్పాటు చేయరాదు అని, వారికి ఆహారం, ఆశ్రయం అందించవద్దు అంటూ స్థానిక జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఆ ఆదేశాలను మణిపూర్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొద్దన్న ఆదేశాలను ఉపసంహరించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉన్నది.
శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దు అని మణిపూర్లోని చండేల్, టెంగునోపాల్, కామ్జోంగ్, ఉక్రుల్, చురాచంద్పూర్ జిల్లాల్లో ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రీతిలో ప్రవేశిస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పించవద్దు అంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
మానవ సంక్షోభం దృష్ట్యా మయన్మార్ నుంచి వలస వస్తున్న వారికి ఆశ్రయం ఇవ్వాలని మయన్మార్ దేశ అంబాసిడర్ ఐక్యరాజ్యసమితిని కోరారు. శుక్రవారం మయన్మార్లోని జుంటా సైన్యం సృష్టించిన రక్తపాతంలో సుమారు 90 మంది మరణించిన విషయం తెలిసిందే.