40 ఏళ్లుగా సాగుచేస్తున్న భూములను ఆక్రమించుకుంటున్నారు..
అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగ్రహం
కొత్తగా చెట్లు నరికినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్
చేతులు జోడించి వేడుకుంటున్నా.. రైతులను ఇబ్బంది పెట్టొదని వేడుకోలు
సమస్య పరిష్కారం కాకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు టెంట్ వేస్తానని హెచ్చరిక
వాడీవేడిగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ సమావేశం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): స్థానిక ఒడ్డెపెల్లి గార్డెన్లో బుధవారం నిర్వహించిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో పోడు భూములపై రగడ జరిగింది. 40 ఏండ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న భూములను అటవీ భూముల పేరుతో రైతులను ఆశాఖ అధికారులు ఇబ్బందులను గురిచేస్తున్నారని, రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. “40 ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. నాగళ్లను విరగ్గొడుతున్నారు.. ఇది విత్తనాలు వేసుకునే సమయం.. ఈ సమయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.. ఒకవేళ కొత్తగా ఒక్క చెట్టు నరికినట్లు నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సిర్పూర్ నియోజకవర్గంలో 40 గ్రామాల్లో ఇలాంటి సమస్యలను కావాలనే సృష్టిస్తున్నారు.
ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి.. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేస్తా” అని హెచ్చరించారు. అడవులను నరికి పోడు వ్యవసాయం చేస్తే కాగజ్నగర్ అటవీ డివిజన్లో 11 పులులు ఆవాసం ఏర్పర్చుకునేవా? అని ఆయన ప్రశ్నించారు. అటవీ సమీప గ్రామాల్లో రోజూ పశువుల మందలపై పులులు దాడులు చేస్తున్నాయని, ఇప్పటి వరకు ఇద్దరిని చంపేశాయని, అయినప్పటికీ తాము వాటికి ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదన్నారు. అటవీశాఖ అధికారులకు తాము సహకరించకపోతే పులుల సంఖ్య పెరిగేదా? అని అన్నారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు రైతుల జోలికి వెళ్లవద్దని ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అటవీశాఖ అధికారులకు సూచిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని, ఇప్పటికైనా అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీనిపై జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం స్పందించారు. జిల్లాలో 2500 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. వీటిని విడుతల వారీగా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందిస్తూ.. 2500 ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురైతే మీరేం చేశారని ప్రశ్నించారు. తీరా రైతులు పంటలు సాగుచేసుకునే సమయంలో ఇబ్బందులు పెట్టడం దేనికన్నారు.. అటవీశాఖ అధికారులు మొక్కలు నాటాలనుకుంటే తాను 10 వేల ఎకరాల స్థలాన్ని చూపిస్తానని పేర్కొన్నారు. రైతులు సాగుచేసుకుంటున్న భూములు కొత్తగా అడవులను నరికి సాగుచేసుకుంటున్నట్లయితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూముల జోలికి వస్తే ఊరుకునేది హెచ్చరించారు.
జిల్లా వైద్యాధికారి సరెండర్కు జడ్పీ తీర్మానం..
జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలును సరెండర్ చేయాలని జడ్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఏఎన్ఎం, జీఎన్ఎం, ఫార్మాసిస్ట్ల పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావ్ ఆరోపించారు. పోస్టుల భర్తీలో పాటించిన పారదర్శకత, నిబంధనలు చెప్పాలని, పోస్టుల భర్తీ దీనిపై వివరణ ఇవ్వాలని డీఎంహెచ్వోను కోరారు. దీనిపై ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండగా.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలుగజేసుకున్నారు. జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా ఎవరు పని చేస్తున్నారని, ఏ పద్ధతి ప్రకారం ఆయనను నియమించారని ప్రశ్నించారు. దీంతో డీఎంహెచ్వో కుమ్రం బాలు వ్యక్తిగత ఆరో పణలు చేశారు. దీంతో ఆగ్రహించిన సభ్యులు డీఎంహెచ్వోను సరెండర్ చేయాలని తీర్మానించారు.
పోడు రైతులను ఇబ్బందులు పెట్టవద్దు..
తరతరాలుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతుల ను అటవీ అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లాలో చాలా వరకు రైతులకు రెవె న్యూ ప ట్టాలున్నాయని, వారి జోలికి ఎవరూ వెళ్లడం లేదని, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి తెలిపారు.