వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక అధికారాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగిస్తూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్పై ఉన్న నమ్మకం, మంత్రి కేటీఆర్ ప్రణాళికలతో వరంగల్ ప్రజలు టీఆర్ఎస్కు ఘన విజయాన్ని అందించారని అన్నారు. వరంగల్ కార్పొరేషన్కు ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం బుధవారం హన్మకొండలోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్కు అండగా నిలిచిన వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయమని, దాన్ని నిలబెట్టుకునేలా పనితీరు ఉండాలని సూచించారు. ప్రజల ఆదరణను పెంచుకునేలా పనిచేసి, రాజకీయంగా ఎదిగేందుకు పునాది వేసుకోవాలని చెప్పారు. అప్పుడే ఏ ఎన్నిక అయినా ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ, వారికి అందుబాటులో ఉంటే మంచి పేరు వస్తుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసిందని దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. రూ.4126 కోట్లతో వరంగల్ మహానగరంలో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, సుందర్రాజు యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు