న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కరోనా వైరస్ ధాటికి భారతావని చిగురుటాకులా వణికిపోతున్నది. గతేడాదితో పోల్చితే సెకండ్ వేవ్లో కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. యువత, పిల్లలనూ ఈసారి మహమ్మారి వదలడం లేదు. దీంతో దేశంలో హెల్త్ ఎమర్జన్సీ ఏర్పడుతుండగా, అంతా ఆరోగ్య బీమా క్లెయిములకు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడీ పరిస్థితే బీమా రంగంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటిదాకా బీమా సంస్థలకు కరోనా బాధితుల నుంచి వచ్చిన క్లెయిముల విలువ రూ.15వేల కోట్లపైనే. దీన్నిబట్టి ఈ ప్రాణాంతక అంటువ్యాధి బీభత్సాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణసహా ఆరు రాష్ర్టాల్లోనే క్లెయిముల విలువ రూ.10వేల కోట్లు దాటడం గమనార్హం.
కేసుల ఉద్ధృతితో..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడు తొలి వేవ్లో వృద్ధులు అధికంగా కరోనా బాధితులైతే.. ఈసారి సెకండ్ వేవ్లో యువకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. రోజుకు 5వేల క్లెయిములు వస్తున్నాయని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్గాలు చెప్తున్నాయి. గ్రామాలతో పోల్చితే పట్టణాలు, నగరాల నుంచే క్లెయిములు ఎక్కువగా వస్తుండటం గమనార్హం. మరోవైపు కొన్ని దవాఖానలు క్యాష్లెస్ చికిత్సకు అంగీకరించడం లేదని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ప్రీమియం ధరలకు రెక్కలు
కరోనా కారణంగా క్లెయిములు పెరిగిపోతుండటంతో బీమా సంస్థలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. దీంతో ప్రీమియం ధరలను పెంచే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఆరోగ్య బీమానేగాక.. జీవిత బీమా సంస్థలూ ఇదే దారిలో పయనిస్తున్నాయి. కొవిడ్ మరణాల రేటు పెరుగడమే ఇందుకు కారణం. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర మరో 10-15 శాతం పెరిగే వీలుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఆరోగ్య బీమా కూడా ప్రియం కానున్నది.
‘చాలా కేసుల్లో పేషెంట్లకు ఇంట్లోనే వైద్యం చేయవచ్చు. కానీ కొందరు డాక్టర్లు దవాఖానలో చేరాలని సూచిస్తున్నారు. దీంతో రోగుల్లో భయం పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే తీవ్ర అనారోగ్యం పాలైన వారికి సరైన చికిత్స లభిస్తుంది’
-డాక్టర్ ఎస్ ప్రకాష్, స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్ జాయింట్ ఎండీ
‘గతేడాది కఠిన లాక్డౌన్తో యువకులం తా ఇండ్లకే పరిమితమయ్యారు. ఆంక్షల సడలింపుతో అంతా రెస్టారెంట్లు, పెండ్లిళ్లు, పార్టీలకు తిరగడం మొదలు పెట్టారు. ఇదే మరోసారి కరోనా విజృంభణకు దారితీసింది. వృద్ధులకు వ్యాక్సిన్ అందడంతో యువకులే బాధితులవుతున్నారు’
-డాక్టర్ నరేంద్ర దేధియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు
‘క్లెయిముల్లో దాదాపు 14 శాతం పిల్లలు, వారి తల్లిదండ్రులవే. గత వారం రోజులుగా క్యాష్లెస్ క్లెయిముల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటిదాకా మొత్తం రూ.150 కోట్లపైనే క్లెయిములను చెల్లించాం. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్ల్లోనే క్లెయిములు ఎక్కువ’
-డాక్టర్ భబతోష్ మిశ్రా,మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్
‘కరోనా తొలి వేవ్లో రోగులు 8-15 రోజులు దవాఖాన లో చికిత్స తీసుకున్నారు. కానీ ఈసారి రెండో వేవ్లో మరో వారం రోజులు ఎక్కువే ఉంటున్నారు. పూర్తి ఆరోగ్యం పొందేంత వరకు దవాఖానను వీడటం లేదు. దీంతో సహజంగానే క్లెయిముల విలువ అమాంతం పెరిగిపోతున్నది’
-నిఖిల్ ఆప్టే, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సీపీవో
ఇవీ కూడా చదవండి…
ప్రజల బాగోగులే సీఎం కేసీఆర్కు ముఖ్యం