తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. ఆ సమయంలో ఓ ఉద్యమకారుడికి ఆడపిల్ల పుట్టింది. తన పాపకు ఏం పేరు పెట్టాలని ఆలోచించాడు. ఉద్యమ భావం నరనరాన నింపుకున్న అతడికి ‘జై తెలంగాణ’ నినాదం కన్నా ఏ పేరు మంచిగా అనిపించలేదు. ఇంకేముంది తన గారాలపట్టికి అదే పేరును నామకరణం చేశాడు.
మెదక్ జిల్లా మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్కు చెందిన మ్యాకల నాగేశ్వర్-పద్మావతి దంపతులు వ్యవసాయ కూలీలు. తెలంగాణ అభిమాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నాగేశ్వర్ పెద్ద కూతురుకు అన్నపూర్ణ అని నామకరణం చేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత 2004, ఏప్రిల్ 23న పుట్టిన రెండో కూతురుకు ‘జై తెలంగాణ’ అని నామకరణం చేశారు. ఇప్పుడు ‘జై తెలంగాణ’కు 17 ఏండ్లు నిండాయి. అంగన్వాడీ నుంచి పాఠశాలల్లో ప్రతిచోట జై తెలంగాణ పేరుతోనే చదివించారు. పాఠశాలలోనూ, ఆధార్కార్డు, రేషన్కార్డుల్లోనూ ఆ అమ్మాయి పేరు ‘జై తెలంగాణ’గా నమోదు చేయించారు. ప్రస్తుతం జై తెలంగాణ ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. తన కూతురికి జై తెలంగాణ పేరు పెట్టడం గర్వంగా ఉందని తండ్రి నాగేశ్వర్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని చిన్న కూతురుకు ‘జై తెలంగాణ’ అని పేరు పెట్టినట్టు ఆయన చెప్పారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మెదక్ పట్టణంలో నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెంట జై తెలంగాణ పాల్గొంది. తన తండ్రి నాగేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడగానే టీఆర్ఎస్లో చేరారు. ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే తన కూతురు జై తెలంగాణను ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. 2010లో పర్యటనకు వచ్చిన శ్రీ కృష్ణ కమిటీ సభ్యులు జై తెలంగాణ పేరు విని ఆశ్చర్యపోయారు. దీంతో ఆ పాపను ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నారు.